
న్యూఢిల్లీ: చిప్ల కొరత మరికొంత కాలం పాటు కొనసాగుతుందని మారుతి సుజుకీ ప్రకటించింది. ఫలితంగా కొన్ని కార్ల డెలివరీ టైమ్ పెరుగుతుందని తెలిపింది. మారుతి సుమారు 3.69 లక్షల యూనిట్లను డెలివరీ చేయాల్సి ఉంది. ఇందులో ఎర్టిగా కార్ల కోసం 94 వేల బుకింగ్స్ వచ్చాయి. గ్రాండ్ విటారా కార్ల కోసం 37 వేలు, బ్రెజ్జా కోసం 61,500 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ పేర్కొంది. తాజాగా లాంచ్ చేసిన జిమ్నీ (22 వేలు) , ఫ్రాంక్స్ (12 వేలు) మోడల్స్ కోసం కూడా బాగానే బుకింగ్స్ వచ్చాయని తెలిపింది. చిప్ షార్టేజ్ కొనసాగుతుండడం వలన కిందటేడాది డిసెంబర్లో 46 వేల కార్ల ప్రొడక్షన్ తగ్గిందని, రానున్న క్వార్టర్లలో కూడా ఈ ఎఫెక్ట్ కొనసాగుతుందని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థాయికి వస్తాయో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ప్యాసెంజర్ వెహికల్స్ సెగ్మెంట్ గురించి మాట్లాడుతూ, ఎస్యూవీలు దూసుకుపోతున్నాయని అన్నారు. మార్కెట్లో ఎస్యూవీల వాటా 42.6 శాతం ఉందని, హ్యాచ్బ్యాక్ల వాటా 35 శాతంగా ఉందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 35.5 లక్షల ప్యాసెంజర్ వెహికల్స్ (కార్లు, బస్సులు, టూవీలర్లు వంటివి) అమ్ముడయ్యాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 30.7 లక్షలుగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ప్యాసెంజర్ వెహికల్స్ సెగ్మెంట్ 5–7 శాతం గ్రోత్ సాధిస్తుందని అంచనావేశారు.