
మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ మూవీ పునాదిరాళ్లు మూవీ డైరెక్టర్ గుడిపాటి రాజ్ కుమార్ ఇవాళ( శనివారం) ఉదయం మృతి చెందారు. ఫస్ట్ మూవీకే ఐదు నంది అవార్డులు దక్కించుకున్న ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందారు. ఇటీవల రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ మధ్య ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరయ్యాడు. సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అనారోగ్యంపాలై మృతి చెందాడు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు.
రాజ్ కుమార్ మృతి తీరని లోటు: చిరంజీవి
రాజ్ కుమార్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చిరంజీవి. ఆయన మృతి తీరని లోటన్నారు. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన నట జీవితానికి “పునాది రాళ్లు” వేసింది ఆయనే అన్నారు. ఈ మధ్యనే తన ఇంటికి వచ్చి కలిశారని.. అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగిందన్నారు.ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నా దగ్గరకు వస్తారు అనుకున్నాను ఇంతలో ఇలా జరగటం చాలా బాధాకరమన్నారు.