వరుస షూటింగ్స్ తో చిరంజీవి బిజీబిజీ

వరుస షూటింగ్స్ తో చిరంజీవి బిజీబిజీ

ఇటీవల ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షూట్స్‌‌లో పాల్గొంటూ కమిటయిన చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ముందుగా బాబి డైరెక్షన్‌‌లో చేస్తున్న సినిమా పూర్తవుతుంది. ఆల్రెడీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏదో గెస్ట్ రోల్ అయ్యుంటుందనుకున్నారంతా. కానీ అతను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించబోతున్నాడట. తన పాత్ర కథకి అత్యంత కీలకమని, సినిమాకే హైలైట్‌‌ అవుతుందని అంటున్నారు. అంతేకాదు.. చిరంజీవి, రవితేజలపై ఓ పాట కూడా ప్లాన్ చేశాడట బాబి.

దేవిశ్రీ ప్రసాద్ ఓ మాస్ బీట్‌‌ని రెడీ చేశాడని, త్వరలోనే ఈ సాంగ్‌‌ని షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. చిరంజీవి నటించిన ‘అన్నయ్య’లో ఫుల్‌‌ లెంగ్త్ రోల్ చేసిన రవితేజ, ఆ తర్వాత ‘శంకర్ దాదా జిందాబాద్‌‌’లో ఓ స్పెషల్‌‌ సాంగ్‌‌లో మెరిశాడు. మళ్లీ ఇన్నాళ్లకి వీరి కాంబోలో రానున్న చిత్రం  కావడంతో  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరుని ఫిక్స్ చేశారు కానీ అధికారికంగా ప్రకటించలేదు. దీపావళి కానుకగా రేపు ఉదయం పదకొండు గంటలకు టైటిల్‌‌తో పాటు టీజర్‌‌‌‌ని  కూడా లాంచ్ చేయనున్నారు. శ్రుతీ హాసన్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ని కూడా అప్పుడే విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇద్దరు స్టార్ హీరోలు కావడం, రెండు చిత్రాల్నీ ఒకే సంస్థ ప్రొడ్యూస్ చేస్తూ ఉండటంతో డైలమా ఏర్పడింది. మరి బాక్సాఫీస్‌‌ దగ్గర ఇద్దరూ పోటీ పడతారా లేక డేట్స్‌‌లో మార్పులేమైనా చేసుకుంటారా అనేది వేచి చూడాలి..