రవితేజను మరిచిపోయా... చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

రవితేజను మరిచిపోయా... చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ మూవీ  సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు సిద్దమైంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మీడియా ఇంటరాక్షన్, ప్రెస్ మీట్‌ను ప్రత్యేకమైన సెట్‌లో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో చిరంజీవి తన యూనిట్ సభ్యులందరి గురించి మాట్లాడి హుషారెత్తించారు. అయితే వేదికపై అందరి గురించి మాట్లాడిన ఆయన రవితేజను ప్రస్తావించకపోవడాన్ని గుర్తు చేసుకొని వివరణ ఇచ్చారు.

ప్రెస్ మీట్ తర్వాత ఆ విషయం తెలుసుకొన్న చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘వాల్తేరు వీరయ్య’ టీం ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం వాళ్ల అనుభూతులను పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినంత సంతృప్తిగా అనిపించింది. అయితే, సినిమా విషయాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాలనుకుని, నా తమ్ముడి (రవితేజ) గురించి మాట్లాడటం మర్చిపోయా. ప్రెస్ మీట్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ విషయం తెలిసి వెలితిగా ఫీలయ్యా.

అందుకే ఇప్పుడు ఈ ట్వీట్ చేస్తున్నా. వాల్తేరు వీరయ్య ప్రాజెక్ట్ గురించి చెప్పగానే.. నాతో సినిమా చేయాలని రవి వెంటనే ఒప్పుకున్నాడు. సెట్ లో కలిసి పనిచేసిన ప్రతిరోజు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం. రవితేజతో మళ్లీ ఇన్నేళ్లకు కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, రవితేజ సినిమా చేయకపోయుంటే.. వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. డైరెక్టర్ బాబీ అన్నట్లు పూనకాలు తెప్పించడంలో రవితేజ పాత్ర చాలా ఉంది. ఈ విషయాలన్నీ త్వరలో మాట్లాడుకుందాం’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.