తినేవాళ్లు ఉండాలి కానీ వెరైటీ వంటకాలతో మెప్పించేందుకు హోటల్స్, రెస్టారెంట్లు ఎప్పుడు రెడీగానే ఉంటాయి. ఈ మధ్యే ఐస్క్రీమ్, హలీమ్ దోశ ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో వంటకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే చాక్లెట్ బనానా దోస.. అవును వినేందుకు కాస్త వింతగా ఉంది కదా.. టేస్టు చూసినవాళ్లు మాత్రం వావ్ సూపర్ అంటూ కితాబ్ ఇస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో చెఫ్ ముందుగా సాధారణ దోశను పెనం పైన వేస్తాడు. ఆ తరువాత దానిపైన చాక్లెట్ ముక్కలు వేస్తాడు. మంటకు ఆ చాక్లెట్ ముక్కలు కరిగిపోగానే ఆ క్రీమ్ ను దోశ మొత్తానికి అప్లై చేస్తాడు. ఆ తరువాత రెండు ఆరటిపండ్లను తీసుకుని అటు చివర, ఇటు చివర పెట్టి వాటిని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఇంతటితో ఆ చెఫ్ అగిపోలేదు. దోశను ముక్కలు ముక్కలుగా చేసి దానిపైన సాస్ పోసి కస్టమర్లకు ఇచ్చేస్తాడు.
ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమతమ అభిప్రాయలను వెల్లడిస్తున్నారు. కొందరేమో బాగుందంటే మరోకొందరు ఇదేం పైత్యం అని కామెంట్స్ చేస్తున్నారు. దోశను దోశలాగే ఉంచండి.. ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేసి దోశ తినాలంటేనే విరక్తి పుట్టేలా చేయకండి అంటూ హితవు పలుకుతున్నారు. వెరైటీ వంటకాలు ఇష్టపడేవారు మాత్రం వన్ మోర్ అంటూ లాగించేస్తున్నారు.