యాదగిరిగుట్ట, వెలుగు : సమృద్ధిగా వర్షాలు పడాలని ఆకాంక్షిస్తూ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చేపట్టిన 'వర్ష పాశుపత వరుణ యాగం' సోమవారం ప్రారంభమైంది. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధనతో యాగానికి అర్చకులు అంకురార్పణ చేశారు.
కొండపైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం శివ మూలమంత్ర జపం, వరుణ జపం, రుష్యశృంగ జపాలు, మండపారాధన, శత రుద్రాభిషేకాలు, విరాటపర్వ పారాయణం వంటి కైంకర్యాలను నిర్వహించారు.
