పరువు హత్య: కూతుర్ని ముక్కలుగా నరికిన తండ్రి

పరువు హత్య: కూతుర్ని ముక్కలుగా నరికిన తండ్రి

ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న పాపానికి కన్నతండ్రే కర్కశంగా ఆ యువతి ప్రాణం తీశాడు. కన్నబిడ్డ కంటే పరువే ముఖ్యమని అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికాడు. తప్పించుకోడానికి డెడ్ బాడీని మాయం చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ దారుణం జరిగింది.

థానే జిల్లా తిట్వాలా ప్రాంతంలో ఉండే అర్వింద్ తివారీకి నలుగురు కుమార్తెలు. వారిలో పెద్ద కూతురైన ప్రిన్సీ (22) కుటుంబానికి చేయూతగా ఉండాలని డిగ్రీ పూర్తయ్యాక ఓ కంపెనీలో జాబ్ జాయిన్ అయింది. అక్కడ ఓ యువకుడితో పరిచయమైంది. అతడితో ప్రేమలో పడిన ప్రిన్సీ తన ప్రేమ విషయం తండ్రితో చెప్పింది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. కానీ, ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంటే ముగ్గురు చెల్లెళ్ల పెళ్లికి సమస్య అవుతుందంటూ తండ్రి వాదించాడు. తరచూ ఈ విషయంలో వారి మధ్య గొడవ అవుతోంది. ఇలా గొడవ జరుగుతుండగా ఆవేశంలో తన బిడ్డని చంపేశాడా దుర్మార్గుడు. ఆ తర్వాత కిరాతకంగా బాడీని ముక్కలు ముక్కులుగా నరికాడు. ఇంట్లో నుంచి ఆ ముక్కల్ని మాయం చేయడానికి సూట్ కేసులో సర్ది.. ఆటో మాట్లాడుకుని పయనమ్యాడు.

అటో డ్రైవర్ పట్టించాడు

అప్పటికే ఈ దారుణం చేసి ఎన్ని రోజులైందో ఏమో.. సూట్ కేసు నుంచి భరించలేని చెడ్డ వాసన వస్తోంది. ఇది గుర్తించిన ఆటో డ్రైవర్ అనుమానం వచ్చి అందులో ఏముంది అని అడిగాడు. చెత్త అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు అర్వింద్ తివారి. కానీ, ఆటో డ్రైవర్‌కు అనుమానం వచ్చి కల్యాణ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో ఆపేశాడు. అందులో ఏముందో చూపించాలనడంతో సూట్‌కేసును అక్కడే వదిలేసి పరారయ్యాడు తివారి. ఆటో డ్రైవర్ దాన్ని ఓపెన్ చేసి చూడగా అమ్మాయి డెడ్ బాడీలో నడుము కింది భాగం ముక్కలు ఉన్నాయి. దీనిపై అతడు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అర్వింద్ తివారి ఆటో ఎక్కిన, దిగిన ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా అరెస్టు చేశారు. ఆ సూట్ కేసులో ఉన్నది తన కూతురేనని, ప్రేమ పెళ్లి కోసం పట్టుబట్టడంతో ఇలా చేశానని చెప్పాడు తివారి.