
న్యూఢిల్లీ: అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) కుదిరినా, కుదరకపోయినా వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి భారత పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మేమనీ చెప్పారు. దేశ ప్రయోజనాలపై రాజీ పడే ఒప్పందాలు కుదరవని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రభుత్వం అన్ని పరిశ్రమలతో సంప్రదించి చర్చలకు సిద్ధమైందని, ఇరుదేశాలకు లాభమైతేనే ఒప్పందం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
“ఇండియన్ ప్రొడక్ట్లపై సుంకాలు తగ్గితే అమెరికాలో వీటి సేల్స్ పెంచుకోవడానికి వీలుంటుంది. ఒప్పందం కుదరకపోతే ఆటో, టెక్స్టైల్ రంగాలు సవాళ్లు ఎదుర్కొంటాయి. ముఖ్యంగా మెక్సికో , వియత్నాంతో పోటీ పడాల్సి ఉంటుంది. ఎఫ్టీఏ అనేది దీర్ఘకాలిక వ్యూహం. వెంటనే లాభాలు రావు. రెండు దేశాలు సర్దుబాటు చేసుకోవాలి. భారత కంపెనీలు పోటీతత్వం పెంచుకోవాలి” అని మేమనీ సలహా ఇచ్చారు.