
ఉప్పల్, వెలుగు: కరోనా వైరస్ నిర్ధారణను మరింత వేగవంతంగా గుర్తించేందుకు సీసీఎంబీ (ద సెంటర్ ఫర్సెల్యూలార్ అండ్ మాలిక్యులర్బయాలజీ) అందుబాటులోకి తెచ్చిన డ్రైస్వాబ్ ఆధారిత ఆర్టీ-పీసీఆర్ అవసరమైన కమర్షియల్ కిట్ల తయారీకి మెరిల్ సంస్థ శ్రీకారం చుట్టింది. దేశంలోని డయాగ్నొస్టిక్ ల్యాబ్ల్లో డ్రై స్వాబ్-ఆధారిత పరీక్షలను వాణిజ్యపరంగా స్కేలింగ్ చేయడానికి సీసీఎంబీ, మెరిల్ డయగ్నోస్టిక్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ కమర్షియల్ కిట్లను నేరుగా డ్రైస్వాబ్ ఆర్టీ-పీసీఆర్ కోసం ఉపయోగించవచ్చు. దీనికి ఐసీఎంఆర్ కూడా ఆమోదం తెలిపింది. వీటితో టెస్టుల్లో కచ్చితత్వం ఉండడమే కాకుండా సమయం కూడా చాలా ఆదా అవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు.
500 శాంపిళ్లను టెస్టు చేసేందుకు సుమారు 4గంటల సమయం పడుతుంది. దీనికి తోడు వైరస్ ట్రాన్స్పోర్ట్ మీడియం(వీటీఎం), ఆర్ఎన్ఏ వేరు చేయడం అనే రెండు పరీక్షలకు డబ్బుతో పాటు అధికంగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. అయితే డ్రైస్వాబ్ ఆర్టీ-పీసీఆర్ టెస్టు విధానం వల్ల 40 నుంచి 50శాతం వరకు పరీక్ష ఖర్చులు తగ్గుతాయని, దీనికి తోడు సమయం కూడా చాలా కలిసి వస్తుందని సీఎస్ఐఆర్ -సీసీఎంబీ సైంటిఫిస్ అడ్వైజర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కరోనా డ్రైస్వాబ్ ఆర్టీ-పీసీఆర్ టెస్టు కోసం మెరిల్ డయగ్నోస్టిక్ సంస్థ ప్రస్తుతం నెలకు 2 కోట్ల కిట్లను తయారు చేసేందుకు సీసీఎంబీతో అగ్రిమెంట్ చేసుకుంది. ఒక్క కిట్తో వంద శాంపిళ్లను పరీక్ష చేయవచ్చు. ఒక్కో శాంపిల్ పరీక్షకు కేవలం రూ.45 నుంచి రూ.60 ఖర్చు అవుతుంది.