
న్యూఢిల్లీ: దేశంలోని సిటీ గ్రూప్ రిటైల్ బిజినెస్లు యాక్సిస్ బ్యాంక్ చేతికి వెళ్లేటట్టు ఉన్నాయి. డీల్ కంప్లీట్ చేసే స్టేజ్లో యాక్సిస్ బ్యాంక్ ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. డీల్ విలువ 2.5 బిలియన్ డాలర్లు (రూ.18,750 కోట్లు)గా ఉంటుందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్స్ వచ్చాక డిటైల్స్ను యాక్సిస్ బ్యాంక్ ప్రకటిస్తుందని చెప్పారు. అగ్రిమెంట్ ప్రకారం, 2 బిలియన్ డాలర్లను క్యాష్గా యాక్సిస్ బ్యాంక్ చెల్లించనుంది. సిటీ గ్రూప్ రిటైల్ బిజినెస్ కోసం టాప్ బ్యాంకులు పోటీ పడగా, యాక్సిస్ బ్యాంక్ డీల్ను కుదుర్చుకోగలిగిందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. దేశంలోని సిటీ గ్రూప్ ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీని ఆఫర్ చేయడం వంటి అంశాలలో మిగిలిన బ్యాంకులతో పోలిస్తే యాక్సిస్ బ్యాంక్ ముందుందని అన్నారు. కాగా, డీల్ పూర్తయ్యాక యాక్సిస్ బ్యాంక్లో సిటీ గ్రూప్ రిటైల్ బిజినెస్ను మెర్జ్ చేయడానికి కనీసం ఆరు నెలల టైమ్ పడుతుందని అంచనా. డీల్ చివరి దశలో ఉన్నప్పటికీ, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, సిటీ గ్రూప్ ప్రతినిధులు ఈ అంశంపై కామెంట్ చేయడానికి ఇష్టపడలేదు. కాగా, మొత్తం 13 దేశాల్లోని రిటైల్ బిజినెస్ను అమ్మేస్తామని సిటీ గ్రూప్ కిందటేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. సిటీ గ్రూప్ వెల్త్ మేనేజ్మెంట్ వంటి బిజినెస్లను కొనసాగిస్తుంది. కేవలం రిటైల్ బిజినెస్లను మాత్రమే అమ్ముతోంది.