- నేషనల్ మెడికల్ కమిషన్కి కాళోజీ వర్సిటీ వినతి
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల పర్మిషన్లు రద్దయిన 3 మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులను, ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ను కోరామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి తెలిపారు. ఎన్ఎంసీ నుంచి మార్గదర్శకాలు రాగానే స్టూడెంట్లను ఇతర కాలేజీల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటామని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు నష్టపోకుండా యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని వీసీ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టూడెంట్లు సీటు కోల్పోయే అవకాశం లేదన్నారు. అయితే, స్టూడెంట్లకు రీలొకేషన్కు సంబంధించి ఈ నెల 17న స్టేట్ హెల్త్ సెక్రటరీకి, కాళోజీ వర్సిటీ వీసీకి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు ఎన్ఎంసీ ఓ లేఖ రాసింది. రీలొకేషన్కు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇందులో ఉండడం గమనార్హం. ఎన్ఎంసీ లేఖలో స్పష్టత లేనందునే, మరోసారి స్పష్టంగా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరినట్లు మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు.
స్టూడెంట్ల భవిష్యత్ ఏంది?: మంత్రి హరీశ్ ఆరా :-
పర్మిషన్లు రద్దయిన 3 కాలేజీల్లోని స్టూడెంట్ల భవిష్యత్ ఏంటని మంత్రి హరీశ్రావు ఆరా తీశారు. కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి మంత్రితో శనివారం భేటీ అయ్యారు. ఆ కాలేజీలు ఎన్ఎంసీకి అప్పీల్ చేసుకున్నాయని, అనుకూలంగానే ఎన్ఎంసీ నిర్ణయం ఉండొచ్చునని వీసీ మంత్రికి వివరించినట్టు తెలిసింది. అదే జరిగితే స్టూడెంట్లు ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో కొనసాగొచ్చని, ఒకవేళ కాలేజీలకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం స్టూడెంట్లను ఇతర కాలేజీల్లోకి సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రికి వివరించారు.
మరిన్ని వార్తల కోసం :-
అసలైన ముద్దాయిలను ఎందుకు వదిలేస్తున్నరు?
కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టేలా ప్లానింగ్