
- ఆ తరువాతే భూసేకరణ చేపట్టాలి
హైదరాబాద్సిటీ, వెలుగు: ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై స్పష్టత ఇవ్వాలని, రైతుల అనుమతి లేకుండా భూసేకరణ చేయరాదని సీపీఎం డిమాండ్చేసింది. 2013 భూసేకరణ చట్టంలో చెప్పినట్టు మార్కెట్ ధరకు అదనంగా నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలని, ఆ తర్వాతే భూసేకరణ చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.
సోమవారం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ డీజీ నర్సింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహంగీర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ట్రిపుల్ఆర్ దక్షిణ భాగంలో 345 కి.మీ. నిర్మించాలని నిర్ణయించి 20 వేల ఎకరాల భూసేకరణకు ప్లాన్ రూపొందించిందన్నారు. మొదటి అలైన్మెంట్ ప్రతిపాదనలో 189.5 కి.మీ., రెండో అలైన్మెంట్లో 201 కి.మీ., మూడో అలైన్మెంట్లో 218 కి.మీలకు పెంచారని, ఇందులో ఏ అలైన్మెంట్ను ఫైనల్చేశారో ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు.
గతంలో ఔటర్రింగ్ రోడ్డు విషయంలో పలుకుబడి కలిగిన వారి భూములను సేకరించకుండా అలైన్మెంట్ను మార్చారని, ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగుతోందన్నారు. ఉత్తర భాగంలో ఇప్పటివరకు సేకరించిన భూమికి రైతులకు మార్కెట్ ధర ఇవ్వలేదన్నారు. ట్రిపుల్ ఆర్ వెంట రైల్వే లైన్ ప్రతిపాదన కూడా ఉందని, హైవే – రైల్వే లైన్ కొంత భూమిని, రింగ్రోడ్డుకు కలిసే జంక్షన్లకు అదనపు భూమిని సేకరిస్తున్నారని, వీటన్నింటికీ ఒక స్పష్టమైన విధానం రూపొందించి భూసేకరణపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.