- సీడబ్ల్యూ సీఆర్ఎస్ కు రూ.1.60 కోట్లు మంజూరు
- సైట్ లో పనుల కోసం రూ.1. 20 కోట్ల టెండర్లు ఖరారు
- ఈసారి కూడా రిజర్వాయర్ లో నిల్వ ఉండే నీరు 2 టీఎంసీలే..
గద్వాల, వెలుగు : నెట్టెంపాడులో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్ల పై త్వరలో క్లారిటీ రానున్నది. రిజర్వాయర్ కు రిపేర్లు చేయాలా? లేదా? అనే విషయాలపై సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూ సీఆర్ ఎస్) ను రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీకి రూ.1.60 కోట్లు మంజూరు చేసింది. అలాగే రిజర్వాయర్ మట్టి నమూనాల సేకరణ, డ్రిల్లింగ్ ఫిల్ అప్ మట్టి పరీక్షల పనుల కోసం రూ.1.20 కోట్ల టెండర్ పిలువగా ‘సాయిగణేశ్అసోసియేట్ హైదరాబాద్’ ఆ పనులను దక్కించుకుంది. దీంతో కమిటీ పరిశీలన అనంతరం రిపోర్టు ఇచ్చాక రిజర్వాయర్ రిపేర్ల పనులు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.
ఈసారి కూడా 2 టీఎంసీలే..
నెట్టెంపాడు లిఫ్టులో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం నాలుగు టీఎంసీలు. లెఫ్ట్ కెనాల్ ద్వారా 25 వేల ఎకరాలు, రైట్ కెనాల్ ద్వారా 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. కానీ, రిపేర్లు కంప్లీట్ కాకపోవటంతో ఈసారి కూడా పూర్తిస్థాయి నీటిమట్టం లేకుండానే కేవలం 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచనున్నారు.
దీంతో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత సీజన్ నెట్టెంపాడు ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి కూడా రెండు టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో పంటలు చివరి దశలో నీటి పంపిణీ ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2019లో సీపేజీ గుర్తించినా..
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్ ను ధరూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు గ్రామ సమీపంలో నిర్మించారు. నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో దీన్ని చేపట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు చేశారనే ఉద్దేశంతో కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో రిజర్వాయర్లు, కెనాల్స్ దెబ్బతిన్నాయి. ర్యాలంపాడు రిజర్వాయర్ కట్టకు బుంగలు పడి నీళ్లు లీక్ అవుతున్నాయని 2019లోనే గుర్తించారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపేజీ మరింత పెరిగింది.
సర్వేలతోనే కాలయాపన..
ర్యాలంపాడ్ రిజర్వాయర్ కు బుంగలు పడి ఏడేండ్లు గడుస్తున్నా రిపేర్ లపై ఇప్పటివరకు క్లారిటీ లేకుండా పోయింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు నిరసన తెలిపారు. దీంతో 2021లో రిటైర్డ్ ఇంజినీర్ల బృందం రిజర్వాయర్ను పరిశీలించింది. పూర్తిస్థాయిలో నింపితే కట్టకు ప్రమాదం అని చెప్పి సామర్థ్యాన్ని సగానికి తగ్గించారు.
రిటైర్ట్ ఇంజినీర్ల బృందం రిజర్వాయర్ ను పరిశీలించి వెళ్లిన అనంతరం లీకేజీల కంట్రోల్ కోసం ఇరిగేషన్ ఆఫీసర్లు చేపట్టిన సర్వేకే ఏడాది పట్టింది. సర్వే పనులను టెండర్ ద్వారా ‘శ్రీ సాయి గణేశ్ కంపెనీ’కి అప్పజెప్పగా బుంగలు ఎలా పడ్డాయి, ఎలా పూడ్చాలి, అనే అంశాలపై వారు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ను ఆఫీసర్లు సెంట్రల్ డిజైన్ ఆఫీస్(సీడీవో )కు ఫార్వర్డ్ చేశారు.
అయినా ఒక్క అడుగు ముందుకు పడలే. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూణే కమిటీ పరిశీలన చేసింది. ఆ కమిటీ ఇంకా పూర్తిస్థాయి రిపోర్టు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి రిపోర్ట్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కమిటీకి అయ్యే ఖర్చులు, పనుల కోసం ఫండ్స్ రిలీజ్ చేయడంతో త్వరలో రిపేర్లపై క్లారిటీ రానున్నది.
ఆశగా ఎదురు చూస్తున్న రైతులు..
ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ర్యాలంపాడు రిజర్వాయర్ ను పరిశీలించారు. నెట్టెంపాడు ఎత్తిపోత పథకంలో ఉన్న 10 శాతం పెండింగ్ పనులను, ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్లను దాదాపు రూ.2,327 కోట్లతో కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం త్వరగా రిపేర్లు చేస్తుందని, ఆయకట్టుకు నీరందుతుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.
త్వరలోనే కమిటీ పనులు షురూ..
ర్యాలంపాడ్ రిజర్వాయర్ దగ్గర సీడబ్ల్యూ సీఆర్ఎస్ కమిటీ త్వరలోనే పనులు ప్రారంభిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చింది. రిపేర్లపై ఆ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే కమిటీ ఫైనల్ రిపోర్టు ఇస్తుందని ఆశిస్తున్నాం. ఈసారి కూడా రెండు టీఎంసీలే నిల్వ ఉంచి రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందిస్తాం. -రహీముద్దీన్, ఎస్ సీ, ఇరిగేషన్ శాఖ
