- అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఎల్బీ స్టేడియంలో సమస్యలపై వీ6 చానెల్లో వచ్చిన కథనానికి క్రీడా శాఖలో కదలిక వచ్చింది. ఆయా సమస్యల పరిష్కారంతోపాటు రూ.34 లక్షల ఖర్చుతో నిర్మించిన స్కేటింగ్ రింక్ను- వాడుకలోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కొత్త బాస్కెట్ బాల్ కోర్ట్ ఏర్పాటు కోసం వచ్చిన విజ్ఞప్తుల మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఎల్బీ స్టేడియంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి స్కేటింగ్ రింక్లో ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులతో పాటు వారి కోచ్లతో ఆయన మాట్లాడారు.
స్కేటింగ్ రింక్ దెబ్బతినడం వల్ల ఎదురువుతున్న ఇబ్బందులను వారు మంత్రికి వివరించారు. దీంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా కొత్తగా స్కేటింగ్ రింక్ సిద్ధం చేయాలని శాట్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం శాట్స్ అధికారులతో పలు అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. బాస్కెట్ బాల్, స్కేటింగ్ క్రీడా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మంత్రి వెంట శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.