హైదరాబాద్, వెలుగు: కేంద్రం తెచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను రాష్ట్రంలో అమలు చేసేందుకు గైడ్లైన్స్, రూల్స్ రూపొందించాలని హైకోర్టు రాష్ట్ర సర్కారును ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలిల డివిజన్ బెంచ్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కేంద్రం తెచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను రాష్ట్రం అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఫోరం అగెనెస్ట్ కరప్షన్ ప్రెసిడెంట్ విజయ్గోపాల్ పిల్ వేశారు. కరోనా టైంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ లాయర్ వాదించారు. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రం అసెంబ్లీ, మండలి లో ఆమోదం చెప్పినా గైడ్లైన్స్ ఇవ్వలేదన్నారు. గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ వాదిస్తూ ఉభయ సభలు ఆమోదించాయని, చట్టం అమలుకు వీలుగా గైడ్లైన్స్, రూల్స్ తయారీకి సమయం కావాలని కోరారు. దీంతో నాలుగు వారాల టైమ్ ఇస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
