
ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు ప్రజలు గుర్తుకు వస్తారని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒకరికి రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్ రామంతాపూర్ లో చేపట్టిన 48 గంటల నిరసన దీక్షలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో సాధ్యం కానీ హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను కేసీఆర్, కేటీఆర్ మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు.
గృహలక్ష్మి, బీసీ బంధు, దళిత బంధు పథకాలలో నియోజకవర్గంలో పది మందికి కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు 30శాతం కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు లక్ష్మణ్. అర్హులైన ప్రతిఒకరికి రాష్ట్ర సంక్షేమ పథకాలు అందేవిధంగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలను ఆశ చూపి బీఆర్ఎస్ చేరాలని ఒత్తిడి చేస్తున్నారని.. కుల వృత్తుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని లక్ష్మణ్ గుర్తు చేశారు.