కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోని సీఎం
ఖాళీల వివరాలు గుర్తించినా ఆమోద ముద్ర వేయలే
లక్షలాది మంది నిరుద్యోగులకు మరోసారి నిరాశ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీని సర్కార్ పక్కన పెట్టేసింది. వేకెంట్ పోస్టులను ఐదు రోజుల్లో గుర్తించాలని గత కేబినెట్ మీటింగ్లో ఆదేశించిన సీఎం కేసీఆర్.. 17 రోజుల తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. జులై 13,14 తేదీల్లో కేబినెట్ సమావేశమైంది. 50 వేల పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా పక్కాగా ఖాళీలను గుర్తించి నివేదించాలని సీఎం అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశించారు. అన్ని డిపార్ట్మెంట్ల మంత్రులు, సెక్రటరీలు ఖాళీల వివరాలు తీసి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపారు. ఖాళీలు, ప్రమోషన్లతో మిగిలిన పోస్టులతో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టుల వివరాలతో కలిపి 70 వేలకు పైగా వేకెంట్ పోస్టులున్నట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ తయారు చేసింది. దీనిపై మంత్రి హరీశ్రావు రివ్యూ చేశారు. అవే వివరాలను కేబినెట్కు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఖాళీలపై క్యాబినేట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నాన్చుడు ధోరణి ఇంకెన్నాళ్లు
50 వేల పోస్టుల రిక్రూట్మెంట్, వేకెంట్ పోస్టుల సంఖ్యపై సర్కార్ ఇంకా నాన్చుడు ధోరణినే అవలంబిస్తోంది. కావాలనే నోటిఫికేషన్లు ఆలస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఖాళీలపై ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నరు. నిజంగా రిక్రూట్మెంట్ చేయాలని అనుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేని పోస్టులకు పర్మిషన్ ఇచ్చి, నోటిఫికేషన్ జారీ చేయొచ్చని అధికారులే అంటున్నారు. ఇప్పటికే ఆరేడు సార్లు వేకెంట్ పోస్టుల వివరాలు సమగ్రంగా ఇచ్చామని వివిధ డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం చేశారు. తర్వాత జూలై 9న రిక్రూట్మెంట్ ప్రక్రియ వెంటనే మొదలుపెట్టాలని ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పుడేమో పూర్తిగా పక్కన పెట్టేశారు.