మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ షాక్

మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ షాక్

శామీర్ పేట, వెలుగు: మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా శామీర్ పేట మీదుగా వెళ్తున్నారని తెలుసుకున్న మంత్రి ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా శామీర్ పేట రాజీవ్ రహదారిపై కట్టమైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డప్పులు, డ్యాన్సులతో నానా హంగామా చేశారు. రాజీవ్ రహదారిని గులాబీమయం చేశారు. కానీ, కేసీఆర్ హెలికాప్టర్లో పెద్దపల్లికి వెళ్లినట్టు తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందారు. తర్వాత అక్కడికి వచ్చిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు మేయర్లు ఇతర పార్టీ నాయకులు వెళ్లిపోయారు.