- వాసాలమర్రిలో నేడు సీఎం గ్రామసభ
- ఇంటింటికీ తిరిగి పాసులు ఇస్తున్న సెక్రటరీలు
- రోడ్డు పక్కల ఊళ్లన్నీ సాఫ్ ఏర్పాట్లలో బిజీ అయిన ఆఫీసర్లు
యాదాద్రి, తుర్కపల్లి, వెలుగు : వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన ఆఫీసర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కలెక్టర్ ఆకస్మిక బదిలీ నేపథ్యంలో అధికారులు రేయింబవళ్లు పని చేస్తున్నారు. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 22న జరిగే గ్రామసభ కోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే మోహరించింది. సీఎం రోడ్డు మార్గాన వస్తారని తెలియడంతో భువనగిరి నుంచి వాసాలమర్రి వరకు మధ్యలో ఉన్న అన్ని గ్రామాల్లో రోడ్లను క్లీన్ చేస్తున్నారు. ట్రాక్టర్ల మీద మొక్కలు తెప్పించి భువనగిరి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసాలమర్రి వరకు రోడ్డుకి ఇరువైపులా ఉపాధి కూలీలతో నాటిస్తున్నారు.
సీఎం ఆదేశాలతోనే..
సీఎం గ్రామసభకు పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి పాస్ ఇవ్వాలని, అందరూ మీటింగ్కు అటెండ్ అయ్యేలా చూడాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో 10 మంది విలేజ్ సెక్రటరీలు ఇంటింటికి తిరిగి పాసులు జారీ చేస్తున్నారు. పాస్ఉన్నవారే సీఎం కేసీఆర్తో సహపంక్తి భోజనం చేసి.. మీటింగ్కు హాజరవుతారు. పక్కనఉన్న తుర్కపల్లి, కొండమడుగు గ్రామాల ప్రజలను కూడా ఈ సభకు అనుమతించడం లేదు. గ్రామసభ జరుగుతున్నప్పుడు వాన పడ్డా ఇబ్బంది లేకుండా వాటర్ప్రూఫ్ టెంట్లు వేశారు. కరెంట్ పోకుండా స్పెషల్గా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. . సీఎం మీటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కూడా సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. వాసాలమర్రిని మొత్తం భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సీపీ మహేశ్భగవత్ నేతృత్వంలో పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో జల్లెడ పడుతున్నారు.
వాసాలమర్రి రోల్ మోడల్: మంత్రి జగదీశ్రెడ్డి
వాసాలమర్రిని రాష్ట్రంలోనే మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేయాలని కేసీఆర్ దత్తత తీసుకున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఏర్పాట్లు పరిశీలించిన తర్వాత మాట్లాడారు. వాసాలమర్రిలో ఏఏ కార్యక్రమాలు చేపట్టేది సీఎం ప్రకటిస్తారని చెప్పారు.