టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నయ్

టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నయ్

వనపర్తి: రాజాసింగ్ వెనుక కేసీఆర్ ఉన్నట్లు చర్చ నడుస్తోందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా వెలిగొండ గ్రామస్ధులతో మాట ముచ్చట నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకుంటున్నారని విమర్శించారు. డైవర్షన్ స్కీమ్ కింద రాజాసింగ్ ఎపిసోడ్ తీసుకొచ్చారనే అనుమానం కలుగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన అంశాన్ని మళ్లించడానికి కేసీఅర్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి రాజాసింగ్ మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లడటం సరికాదన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నాయన్న షర్మిల... ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి కూతురుగా ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.  ప్రజా సంక్షేమం కోసం తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 1800 కిలోమీటర్లు పూర్తి చేసుకుందన్న షర్మిల... అందుకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్టీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.