
తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడున్న స్థలంలోనే ఇప్పటి కన్నా విశాలంగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ‘‘తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చివేసి, కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో అక్కడున్న ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగింది. ఇలా జరగడం పట్ల నేను ఎంతో బాధపడుతున్నాను. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప.. ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఎన్నికోట్లయినా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి, వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తాం. దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా.. ప్రార్థనా మందిరాలను కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి లౌకిక స్పూర్తిని కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ ఘటన కాకతాళీయంగా జరిగిందని.. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.
For More News..