ఎవరి డ్యూటీ ఏందో చెప్తం..ఆ తర్వాతే యాక్షన్ ప్లాన్: కేసీఆర్

ఎవరి డ్యూటీ ఏందో చెప్తం..ఆ తర్వాతే యాక్షన్ ప్లాన్: కేసీఆర్
  • స్థానిక సంస్థల విధులు, నిధులు, బాధ్యతలపై స్పష్టత ఇస్తం
  • పంచాయతీ రాజ్ శాఖపై సమీక్షలో సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగుగ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ ల వరకు ఎవరు ఏ డ్యూటీ చేయాలన్న దానిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని సీఎం కేసీఆర్​చెప్పారు. గ్రామాల్లో 60 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు కావడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతలపై ప్రకటన చేస్తామని తెలిపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష జరిపారు.

ఏ పని లేకుండా ఉన్నరు

‘‘సహాయ మంత్రి హోదా ఉన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కూడా ప్రస్తుతం ఏ పని లేకుండా ఉన్నరు. ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా ఇంతే. స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా పాలనలో భాగస్వామ్యం కావాలె. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుధ్యం..ఇలా ఏ విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారిస్తం. ఇకపై జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు (మొదటి పేజీ తరువాయి)

ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవు. అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తం” అని సీఎం వివరించారు. విధులను స్పష్టంగా పేర్కొని, నిధులు విడుదల చేసిన తర్వాతే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంపు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల అవుతాయని, అదే సమయంలో దానికి సమానంగా రాష్ట్ర వాటా నిధులు విడుదల చేస్తామన్నారు.

విధులు, అధికారాలపై స్టడీ చేయండి

గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు ఏ విధులు నిర్వర్తించాలి? ఏఏ అంశాల్లో వారి బాధ్యతలు ఎంత వరకు ఉంటాయి? ఎలాంటి అధికారాలుంటాయి? తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తిస్థాయి స్టడీ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీ రాజ్ విభాగంలో అనుభవం ఉన్న నాయకులు, అధికారులు, నిపుణులతో చర్చించి ముసాయిదా రూపొందించాలని సూచించారు. ముసాయిదాపై ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో.. తర్వాత మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని, చివరికి అసెంబ్లీలో కూడా విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. సలహాలు, సూచనలు తీసుకుని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

ఖాళీలన్నీ భర్తీ చేయాలె

పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈపీవోఆర్డీ పోస్టుల్లో పని చేసే వారిని మండల పరిషత్ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డీపీవోలు, సీఈవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నేరుగా నియామకాలు జరపాలని సీఎం చెప్పారు. సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, తేరా చిన్నపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.