- సమస్యను పరిష్కరించకుంటే ప్రగతి భవన్ను ముట్టడిస్తం
- ప్రాజెక్ట్ రీడిజైన్పై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి: వివేక్ వెంకటస్వామి
- రూ.36 వేల కోట్ల ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు తీసుకపోయిండు
- రైతుల్ని కోటీశ్వరుల్ని చేస్తానని చెప్పి తన కుటుంబ సభ్యుల్ని కోటీశ్వరులను చేసిండు
- ముందు రాష్ట్ర ప్రజలను పట్టించుకోవాలని డిమాండ్
- ఢిల్లీ జంతర్ మంతర్లో రైతులతో కలిసి ధర్నా
- కేసీఆర్కు రైతులే బుద్ధి చెప్తరు: అందుగుల శ్రీనివాస్
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం బ్యాక్ వాటర్తో రైతులకు జరుగుతున్న నష్టంపై ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కండ్లు తెరవాలని, ఆ రైతులను ఆదుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ వస్తే రైతుల్ని కోటీశ్వరుల్ని చేస్తానని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రం సిద్ధించాక కల్వకుంట్ల కుటుంబ సభ్యుల్ని వేలాది కోట్లకు అధిపతులను చేశారని ఆయన అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న గోదావరి, ప్రాణహిత పరీవాహక ప్రాంతాలకు చెందిన రైతులు అందుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నష్టపోతున్న రైతుల్ని ఆదుకునేందుకు చెన్నూరు రైతులతో కలిసి ఢిల్లీలో ఆందోళన బాటపట్టినట్లు చెప్పారు. ముంపు రైతుల గోస కేసీఆర్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరు మొదట ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుగా ఉండేదన్నారు.
తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో నీళ్లు
కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో నీళ్లు తీసుకునేలా ప్రాజెక్ట్ రూపొందించవచ్చని చెప్పారని గుర్తు చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులో చెన్నూరుకు 55 వేల ఎకరాల సాగుకు నీళ్లు ఇస్తామని ఉండేదని తెలిపారు. ప్రాజెక్ట్ రీడిజైన్ కారణంగా ఇప్పుడు చెన్నూరుకు ఆ నీళ్లు అందడం లేదన్నారు. బ్యాక్ వాటర్ కారణంగా భూముల విలువలు కూడా తగ్గాయని చెప్పారు. ఆనాడు రూ. 36 వేల కోట్లతో రూపొందించిన ప్రాజెక్టును కేసీఆర్ సీఎం అయ్యాక కమీషన్ల కోసం తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని, కేసీఆర్ తుగ్లక్ సీఎం అని మండిపడ్డారు. ‘‘తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ చేపడితే.. గ్రావిటీతో నీళ్లు వస్తాయని మాజీ ఇంజనీర్లు, నిపుణులు చెప్పారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రాణహిత –- చేవెళ్ల ప్రాజెక్ట్ ను తెచ్చారు. అయితే తుగ్లక్ ముఖ్యమంత్రి ఏదో డిజైన్ పెట్టి, మేడిగడ్డకు ప్రాజెక్ట్ ను తీసుకుపోయారు. మంథని, చెన్నూర్ నియోజకవర్గాలు కలిపి దాదాపు 40 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి” అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా మూడేండ్లలో ఒక్కో రైతుకు రూ. 70 వేల నుంచి 80 వేల నష్టం జరిగిందన్నారు. రూ. 36 వేల కోట్ల ప్రాజెక్ట్ ను లక్షన్నర కోట్లకు పెంచిన రాష్ట్ర సర్కార్.. ప్రాజెక్ట్ తో నష్టపోతున్న రైతుల్ని ఆదుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే రైతుల కుటుంబాలకు ఆర్థికసాయంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు ప్రాంతాల రైతులకు ఇచ్చినట్లే.. చెన్నూరు, మంథని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ముంపు గ్రామాల్లో భూములు కోల్పోతున్న వారికి మరో చోట అంతే భూమి కేటాయించాలని, అలాగే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ‘‘ఈ రీడిజైన్కు కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి బాధ్యులా? కోట్లు దండుకోవడానికి ఈ రీడిజైన్ చేశారా? సీఎం కేసీఆర్ ధనాపేక్ష ఉందా..? అనేది తేల్చాలి” అని అన్నారు. తప్పుడు డిజైన్, కమీషన్ల పేరుతో నిర్మించిన ప్రాజెక్ట్ తో రైతులు నష్టపోతున్నారని, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడ్ని చేశారని పేర్కొన్నారు. కేవలం కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ నిర్మించారని ఆయన ఆరోపించారు.
దోచుకుంది సరిపోకే బీఆర్ఎస్ డ్రామా
నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటాన్ని మరిచి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మంత్రాన్ని కేసీఆర్ జపిస్తున్నారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ల రీడిజైన్ల పేరుతో దోచుకున్న కమీషన్లు సరిపోక బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజకీయాలు అంటున్నారని దుయ్యబట్టారు. మొదట తెలంగాణ రైతులు, ప్రజల గోస వినాలని కేసీఆర్ కు సూచించారు. కేసీఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న రైతులు ఇల్లు చేరే లోపు వారిపైనా కేసులు పెడతారని అన్నారు. గౌరవెల్లి రైతులపై పోలీసులు జరిపిన దాడిని మరోసారి ఆయన ఖండించారు. ఫామ్హౌజ్కు నీళ్లు వచ్చేలా మల్లన్నసాగర్ను కేసీఆర్ నిర్మించుకున్నారని, అందుకే అక్కడివాళ్లకు రూ. 10 లక్షల నష్టపరిహారం ఇచ్చారని తెలిపారు. గౌరవెల్లి, చెన్నూరు రైతులకు కూడా అదే రీతిలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రధాని మోడీ తెచ్చిన ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ సర్కార్ అమలు చేయక ఒక్కో రైతు రూ. 5 లక్షల వరకు నష్టపోతున్నాడని చెప్పారు. కాళేశ్వరం వల్ల నష్టపోయిన బాధితులను ఒకతాటిపైకి తెచ్చిన అందుగుల శ్రీనివాస్ ను వివేక్ వెంకటస్వామి అభినందించారు.
ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి
ఎల్లంపల్లిలో భూముల కోల్పోయిన బాధితులకు రూ. 10 లక్షలకుపైగా నష్టపరిహారం చెల్లించాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి, ముర్మూర్, పొట్యాల, వేమనూరు, రాంనూర్, పొత్తునూర్, కోటి లింగాల గ్రామాల రైతులకు ఇప్పటికీ నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రైతులు ఇల్లు, భూమి, సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారని తెలిపారు. వీరికి న్యాయబద్ధంగా దక్కాల్సిన నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల పిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని జీవో జారీ చేసినా.. ఏ ఒక్క కుటుంబానికి లబ్ధి జరగలేదన్నారు. ఎల్లంపల్లి బాధితుల కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న ఓ రైతు ఆవేదనపై ఆయన పైవిధంగా స్పందించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బాధితులకు న్యాయం చేసే దిశలో సహకరిస్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ పతనం స్టార్ట్: అందుగుల శ్రీనివాస్
జంతర్ మంతర్ నుంచి తెలంగాణ పోరాటం మొదలైందని, ఇప్పుడు అదే వేదిక నుంచి కేసీఆర్ వినాశనం ప్రారంభమైందని చెన్నూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్, మంచిర్యాల ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ అన్నారు. కాళేశ్వరంతో తమకు జరుగుతున్న నష్టాన్ని ధర్నాలు, నిరసనలు, పాదయాత్రల రూపంలో ప్రభుత్వానికి వినిపించామని, అయినా కేసీఆర్ స్పందించడం లేదని తెలిపారు. చివరి ప్రయత్నంగా ఢిల్లీ వేదికగా ధర్నా చేసి, కేంద్రానికి వినతిపత్రం ఇవ్వాలని వచ్చామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ రైతులతో సంబంధమే లేనట్లు ఉంటున్నారని మండిపడ్డారు. ఈ ధర్నాలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి తుల మధుసూదన్ రావు, చెన్నూరు పట్టణాధ్యక్షుడు సుశీల్, చెన్నూరు నియోజకవర్గానికి చెందిన అన్నారం, జైపూర్, కోటపల్లి, వేములపల్లి, సిర్సా, పుల్లగామ, అల్ గాం, సుందరశీల, చింతలపల్లి, నారాయణపురం, అక్కపల్లి, నర్సక్కపేట గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. కాగా, అందుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల నిర్వాసితులు గురువారం జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలువనున్నారు.
కేసీఆర్ నిజస్వరూపాన్ని దేశమంతా చెప్తం
నాలుగేండ్లుగా మాకు జరుగుతున్న నష్టాన్ని అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపాం. కానీ, స్పందన లేదు. అందుకే ఢిల్లీకి చేరాం. రైతు బంధు, రైతు బీమా పేరుతో రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న కేసీఆర్ నిజస్వరూపాన్ని యావత్ దేశానికి తెలియజేస్తాం.
-ప్రవీణ్ నాయక్, లంబడి పల్లి
పెట్టిన పెట్టుబడి కూడా వస్తలే
నాకు ఐదెకరాల ల్యాండ్ ఉంది. నా పొలంలో పత్తి పండిస్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ముందు పత్తి బాగా పండింది. ఇప్పుడు ఎకరానికి దాదాపు 8 క్వింటాళ్లకు పైగా నష్టం వస్తున్నది. దీంతో పంటకు రూ. 50 వేల వరకు నష్టం వాటిల్లుతున్నది. గడిచిన నాలుగేండ్లలో నాకు దాదాపు రూ. 3 లక్షల నష్టం జరిగింది. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు.
- రాజారాం, రైతు
అప్పుల పాలవుతున్న
వ్యవసాయంపైనే ఆధారపడి నా కుటంబం బతుకుతున్నది. నాకు 2 ఎకరాల పొలం ఉంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నా పొలం సగం వరకు నీట మునుగుతున్నది. దీంతో నాకు తీవ్ర న్యాయం జరుగుతున్నది. వేసిన పంట చేతికి రాక, అప్పుల పాలవుతున్నాను. నా కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. నష్ట పరిహారం చెల్లించాలి.
- దుర్గం రాజమల్లు, దివ్యాంగ రైతు
బ్యాక్ వాటర్ ముంచింది
నేను 10 ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నా పొలంతో పాటూ ఎరువుల బస్తాలు తడిసిపోయాయి. కనీసం కౌలు చెల్లించే పరిస్థితిలో కూడా లేను. మూడేండ్లలో 4 సార్లు, నిరుడు 3 సార్లు బ్యాక్ వాటర్ మా పొలాలను ముంచేసింది.
- మునీందర్ రెడ్డి, కౌలు రైతు