సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలి

సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలి

GHMC ఎన్నికల్లో TRS ఓటమి తర్వాత బీజేపీ పుంజుకుంటోందన్నారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకనే  సీఎం కేసీఆర్ అయోమయం సృష్టించడానికి ఢిల్లీ పర్యటన చేపట్టారన్నారు. ఒకవేళ అధికారికంగా సీఎం హోదాలో కలిస్తే అధికారులను వెంటబెట్టుకుని వెళ్ళాలి,కానీ అలా జరగలేదంటే… ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అవినీతిని బయటపడుతుందన్న భయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిన్న బండి సంజయ్ ఇదే విషయం లేవనెత్తారని చెప్పారు సోయం బాపురావు. వాటికి సమాధానం చెప్పకుండా బండి సంజయ్ మీద వేరే వాళ్ళతో ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్న నినాదం సొంత కుటుంబానికే దక్కాయి తప్ప మరొకరికి రాలేదన్నారు ఎంపీ సోయం బాపురావు. నిరుద్యోగులు ఈ విషయం గ్రహించి ఆగ్రహంతో ఉన్నారన్నారు. అందుకే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల కారణంగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. మొత్తం 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఆదివాసీలు పొడు వ్యవసాయం చేసుకునే భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసగించారన్నారు ఎంపీ సోయం బాపురావు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అది కేంద్ర పరిధిలోకి వస్తుందని, రాష్ట్ర పరిధిలో లేవని కేసీఆర్ వితండవాదం చేస్తున్నారన్నారు. మరి పక్క రాష్ట్రం ఆంధ్రాలో సీఎం జగన్ ఎలా పట్టాలు ఇచ్చారో గ్రహించాలన్నారు.