ప్రారంభోత్సవాలు... శంకుస్థాపనలతో సరి

ప్రారంభోత్సవాలు... శంకుస్థాపనలతో సరి
  •     ప్రజలను నిరాశపర్చిన కేసీఆర్​ టూర్
  •     జిల్లాకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే తిరుగుప్రయాణం..

మంచిర్యాల, వెలుగు:  సీఎం కేసీఆర్​పర్యటనపై ఎంతో ఆశగా ఎదురు  చూసిన  ప్రజలకు నిరాశే మిగిలింది.   జిల్లాకు ఎలాంటి ఎలాంటి వరాలు ప్రకటించకుండా సీఎం వెనుదిరిగారు. టూర్​ అంతా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో  సరిపోయింది.  శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్​ నుంచి హెలిక్యాప్టర్​లో వచ్చిన కేసీఆర్​ ముందుగా నస్పూర్​లోని బీఆర్​ఎస్​ ఆఫీస్​ను ప్రారంభించారు. అనంతరం కొత్త కలెక్టరేట్​ను ఓపెన్​చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల చిరకాల వాంఛ అయిన మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సౌకర్యార్థ్యం సర్కారు ఆఫీసులన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ను నిర్మించామని చెప్పారు. 

పరిపాలన సౌలభ్యం కోసం ఒకటి రెండు నియోజకవర్గాలు ఉన్న ములుగు, భూపాలపల్లి వంటి చోట్ల కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం కలెక్టరేట్​వద్ద బీసీ వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం, సొంత జాగలో ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి స్కీం కింద రూ.3లక్షల సాయంతో పాటు రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించారు. చెన్నూర్​నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1,658 కోట్లలో చెన్నూర్ లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీం, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర పామాయిల్ ఇండస్ర్టీ, రూ.164 కోట్లతో మంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, మెడికల్ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. వికలాంగుల పింఛన్ రూ.వెయ్యి పెంచుతున్నామని ప్రకటించిన కేసీఆర్​ప్రస్తుతం రూ.3,016 ఉన్న పింఛన్​ను వచ్చే నెల నుంచి రూ.4,016 చెల్లిస్తామని అన్నారు. 

సింగరేణి కార్మికులకు నిరాశ...

కలెక్టరేట్​ సమీపంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ప్రజలనుద్దేశించి 35 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్​ధరణి పోర్టల్, సింగరేణి అభివృద్ధి, బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక సాధించిన ప్రగతి గురించి వివరించారు. రైతుల భూముల రక్షణ కోసం మూడేండ్లు కష్టపడి ధరణి పోర్టల్​ తీసుకొచ్చామన్నారు. దాని ఆధారంగానే రైతుబంధు, రైతుబీమా అందుతున్నాయని, భూముల రిజిస్ర్టేషన్లను సులభతరం చేశామని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోందని, కానీ వాళ్లనే బంగాళాఖాతంలో కలుపాలని పిలుపునిచ్చారు. ధరణి పోతే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. అలాగే 134 ఏండ్ల చరిత్ర గల సింగరేణి సంస్థను కాంగ్రెస్​ పార్టీ ఆగం చేసిందని కేసీఆర్​ విమర్శించారు. కేంద్రానికి అప్పు చెల్లించలేక 49 శాతం వాటాను అమ్మేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోల్​మైన్స్​ను ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 

తమ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో సాధించిన ప్రగతి గురించి వివరించిన కేసీఆర్​కార్మికులకు కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వకుండా పాత విషయాలనే ప్రస్తావించడంపై పెదవి విరుస్తున్నారు. ఈ సభలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బి.వెంకటేశ్ నేత, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్​జడ్పీ చైర్ పర్సన్లు నల్లాల భాగ్యలక్ష్మి, రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, రేఖానాయక్, కోనేరు కోనప్ప, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్​రావు, పురాణం సతీశ్​కుమార్​, మాజీ ఎమ్మలెయే గడ్డం అరవిందరెడ్డి, టీబీజీకేఎస్​లీడర్లు ఐ.వెంకట్రావు, కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.