పవర్​ బిల్లు కట్టకపోతే  పదవి ఫట్​: సీఎం కేసీఆర్

పవర్​ బిల్లు కట్టకపోతే  పదవి ఫట్​: సీఎం కేసీఆర్
  • సర్పంచ్​లు, గ్రామ కార్యదర్శులు, మున్సిపల్​ చైర్​పర్సన్లు, కార్పొరేటర్లకు సీఎం హెచ్చరిక
  • పంచాయతీలు, మున్సిపాలిటీలు బిల్లులు చెల్లించకపోవడం దారుణమని వ్యాఖ్య
  • పాత బకాయిలను వన్​ టైమ్​ సెటిల్మెంట్​ కింద చెల్లిస్తం
  • విద్యుత్ సంస్థల బకాయిలను జీరో సైజుకు తెస్తం
  • ప్రభుత్వ ఆఫీసులకు ప్రీ పెయిడ్​ మీటర్లు ఏర్పాటు చేస్తం
  • శాఖల బడ్జెట్​ నుంచి ఆర్థిక శాఖతో నేరుగా బిల్లుల చెల్లింపు
  • తక్షణ విద్యుత్​ పనుల కోసం ‘పవర్​ వీక్​’
  • సిటీల్లో ట్రాన్స్​ఫార్మర్ల  ఏర్పాటు కోసం పాలసీ
  • లే అవుట్లలో తగిన స్థలం కేటాయించేలా చూస్తం
  • విద్యుత్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి

హైదరాబాద్‌‌, వెలుగు: ఇక నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సకాలంలో కరెంటు బిల్లులు కట్టకపోతే  సర్పంచ్, గ్రామ కార్యదర్శి, మున్సిపల్​ చైర్​పర్సన్​, కమిషనర్లపై వేటు తప్పదని సీఎం కేసీఆర్​ హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్​ సంస్థలది కీలకమైన పాత్ర అని, కనురెప్పపాటు కూడా కరెంట్​ పోవద్దని తేల్చిచెప్పారు. విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థిక ప్రేరణ అందించడంతోపాటు, అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విద్యుత్ శాఖపై బుధవారం ప్రగతి భవన్ లో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్​ బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించక పోవడం దారుణమన్నారు. వాడిన కరెంటుకు తప్పక బిల్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటి నుంచి ప్రతి నెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ తప్పక బిల్లులు చెల్లించాలి. సకాలంలో కరెంటు బిల్లులు కట్టకపోతే వేటు తప్పదు. పేరుకుపోయిన పాత బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. విద్యుత్ సంస్థల బకాయిలను జీరో సైజుకు తెస్తం”అని సీఎం తెలిపారు.

అనేక ప్రభుత్వ శాఖలు కూడా సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో వాడే కరెంటు కోసం ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చాలని ఆదేశించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటుకు, ఎత్తిపోతల పథకాల విద్యుత్ సరఫరాకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, బడ్జెట్​లోనే ప్రత్యేక గ్రాంటు కేటాయించి, ప్రతి నెలా విద్యుత్ సంస్థలకు అందిస్తుందని వివరించారు. విద్యుత్ సంస్థల బలోపేతం కోసం  నిధులు సమకూర్చుకోవడానికి అవసరమైన చోట ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందన్నారు.  ‘‘రాష్ట్రం ఏర్పడిన నాడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది. నేడు విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందించుకోగలుగుతున్నం. విద్యుత్ సంస్థలు మరింతగా వృద్ధి చెందాలి. అదే సమయంలో రాష్ట్రంలో కనురెప్పపాటు కూడా కరెంటు పోవద్దు. అందుకోసం ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తం’’ అని సీఎం స్పష్టం చేశారు.

సిటీల్లో ట్రాన్స్​ఫార్మర్లకు స్థలం కోసం పాలసీ

హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాల్లో విద్యుత్​ సబ్ స్టేషన్లు పెట్టడానికి, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం అన్నారు. దీన్ని నివారించేందుకు పట్టణాలు, నగరాల్లో చేసే లే అవుట్లలో కచ్చితంగా విద్యుత్ అవసరాలకు తగిన స్థలం కేటాయించేలా ప్రభుత్వం విధానం తెస్తుందని వెల్లడించారు.

ఎత్తిపోతలకు సోలార్​ విద్యుత్​

ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం? దాన్ని ఎలా సమకూర్చాలి? అనే విషయంపై నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని సీఎం తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండ్​ను తట్టుకునేందుకు, తక్కువ ధరకు లభ్యమయ్యే సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ శాఖకు ఎప్పుడు అవసరం ఏర్పడినా తీర్చగలిగే ఆర్థిక విధానం రూపొందించాలని ఆర్థిక శాఖకు సూచించారు. సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జెన్ కో – ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు,ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి,  ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఏడు రోజులు ‘పవర్​ వీక్’

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణ పనుల కోసం  ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని సీఎం కేసీఆర్​ తెలిపారు. 60 రోజుల పాటు అమలయ్యే ఈ కార్యాచరణలో ఏడు రోజులపాటు ‘పవర్ వీక్’ కూడా ఉంటుందన్నారు. ఆ సమయంలో.. వంగిన పోల్స్​ను సరిచేయడం, ఒరిగిన లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగ్​లో లేకుండా చేయడం తదితర పనులను నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. అదే సందర్భంలో సదరు ఊరికి, పట్టణానికి వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమవుతుందీ, ఎంత బిల్లు వస్తుందీ అనే విషయాలను కచ్చితంగా లెక్కించాల్సి ఉంటుందన్నారు.