పొత్తు చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్​ సానుకూలత

పొత్తు చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్​ సానుకూలత
  • ఉమ్మడి ఖమ్మంలోనే మూడు సీట్లు ఉన్నాయనే చర్చ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సీపీఐ రాష్ట్ర నేతలతో ఇటీవల కేసీఆర్​జరిపిన చర్చలు మునుగోడు ఎన్నికలకే పరిమితం కావని, భవిష్యత్​లోనూ పొత్తులు కొనసాగుతాయంటూ తాజాగా సీఎం చేసిన కామెంట్​ పొలిటికల్​వర్గాల్లో హాట్​టాపిక్​గా మారింది. పొత్తుల సందర్భంగా సీపీఐ నేతలు చేసిన పలు ప్రతిపాదనలకు కేసీఆర్​ అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఆరు సీట్లు కావాలని సీపీఐ లీడర్లు అడగగా, అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మూడు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.  

ఆ సీట్లు ఇవే.. 

బీజేపీని ఓడించేందుకు భవిష్యత్​లోనూ కమ్యూనిస్టులతో పొత్తులుంటాయని సీఎం కేసీఆర్​మునుగోడులో ప్రకటించారు. బహిరంగ సభ వేదికపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా కూర్చున్నారు. ఏరకంగా చూసినా పొత్తు ఖాయమని తేలడంతో టీఆర్ఎస్​ సీపీఐకి వదిలేయబోయే సీట్లు ఏవనే చర్చ మొదలైంది. వేదికపై కూర్చున్న కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్​ఆశిస్తున్నారు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంతోపాటు, భద్రాచలం/పినపాక, ఖమ్మం జిల్లాలోని వైరా, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, నల్గొండ జిల్లాలోని  దేవరకొండ, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్​ సీట్లను తమకు కేటాయించాలని సీపీఐ కేసీఆర్​కు ప్రతిపాదించినట్లు  తెలిసింది. ఆయా సీట్లతో పెద్ద సమస్య లేనప్పటికీ హుస్నాబాద్ సెగ్మెంట్​ను​ చాడ వెంకటరెడ్డికి ఇస్తారా లేదా? అనేదానిపై అనుమానాలున్నాయి. ప్రస్తుతం హుస్నాబాద్​నుంచి కేసీఆర్​కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వొడితెల లక్ష్మీకాంతారావు కుమారుడు సతీశ్​బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ ​వెంకటరెడ్డికి హుస్నాబాద్ కేటాయిస్తే సతీశ్​బాబుకు హుజూరాబాద్​ టికెట్​ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. 

ఉమ్మడి ఖమ్మం సీట్లపై సానుకూలత 

మిగిలిన సీట్ల సంగతి పక్కనపెడ్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐకి కేటాయించేందుకు సీఎం కేసీఆర్​ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్​కు చెందిన వనమా వెంకటేశ్వరరావు, వైరా ఎమ్మెల్యేగా రాములు నాయక్​ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కొత్తగూడెం నుంచి తానే పోటీ చేస్తానని వనమా వెంకటేశ్వరరావు చెప్పుకుంటున్నప్పటికీ వనమా రాఘవ వ్యవహారం ఆయనకు మైనస్​గా మారిందని టీఆర్ఎస్​వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో డీహెచ్​గడల శ్రీనివాస్​టీఆర్ఎస్​ నుంచి టికెట్​ఆశిస్తున్నారు. డాక్టర్​ జీఎస్ఆర్​ పేరుతో ట్రస్టు పెట్టి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గడలకు సీటు కేటాయింపుపై కేసీఆర్​ స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారమూ జరుగుతోంది. కానీ ఇటీవల ఆయన కూతురి వివాహానికి టీఆర్ఎస్​ ప్రముఖులెవరూ హాజరుకాకపోవడంతో ఆయనపై హైకమాండ్​ఆలోచన ఏమిటనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు వైరా సీటుపై సిట్టింగ్​ఎమ్మెల్యే రాములు నాయక్​తో పాటు మాజీ ఎమ్మెల్యే మదన్​లాల్​ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పొత్తులో భాగంగా ఈ రెండు సీట్లు సీపీఐకి కేటాయిస్తే  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆయా పార్టీల సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.