బోగస్​ బిల్లులతో..సీఎం రిలీఫ్​ ఫండ్​

బోగస్​ బిల్లులతో..సీఎం రిలీఫ్​ ఫండ్​
  • బోగస్​ బిల్లులతో..సీఎం రిలీఫ్​ ఫండ్​
  • బెల్లంపల్లి నియోజకవర్గంలో కోట్లలో గోల్​మాల్​
  • బుధాకలాన్​లోనే  రూ.అర కోటికి పైగా స్వాహా
  • ఎమ్మెల్యే పీఏలు, అనుచరులే ప్రధాన సూత్రధారులు
  • 30 మందికి చెక్కులు నిలిపివేసిన ఆఫీసర్లు 
  • తమకేం ఫిర్యాదులు రాలేదన్న  ఆర్డీవో  

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి  నియోజకవర్గంలో  సీఎం రిలీఫ్​ ఫండ్​ దుర్వినియోగమవుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు బోగస్​ బిల్లులు పెట్టి లక్షల్లో స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటివరకు రూ.కోట్లలో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో ఆఫీసర్లు 30 మందికి చెక్కులు నిలిపివేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పీఏలతో పాటు ఆయన ప్రధాన అనుచరులే ఈ దందాలో సూత్రధారులని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  బెల్లంపల్లి మండలం బుధాకలాన్​కు చెందిన ఓ మాజీ సర్పంచ్​, వేమనపల్లికి చెందిన  ఓ  మండల స్థాయి నాయకుడు సీఎంఆర్​ఎఫ్​ ఫండ్స్​ భారీ మొత్తంలో స్వాహా చేసినట్టు సోషల్​ మీడియాలో పోస్టింగ్​లు హల్​చల్​ చేస్తున్నాయి.  

కమీషన్లు, బోగస్​ బిల్లులు.. 

 లాక్​డౌన్​ టైమ్​లో ప్రైవేట్​ హాస్పిటళ్లలో  ట్రీట్​మెంట్​ చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్​ ఫండ్​ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. రూ.లక్ష వరకు ఖర్చయితే  బిల్లులో 40 శాతం, లక్ష దాటితే బిల్లులో 8‌‌0 శాతం సీఎంఆర్​ఎఫ్​ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది.  ఇది పూర్తిగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.  బాధితులు ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసుకుంటే  వారు సీఎంవోకు పంపుతారు. అక్కడ త్రీమెన్​ కమిటీ పరిశీలించి ఆర్థిక సాయం మంజూరు చేస్తుంది.  చెక్కులను ఎమ్మెల్యేల చేతుల మీదుగా బాధితులకు అందజేస్తారు. ఇదే అదనుగా ఎమ్మెల్యేల అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారు. బెల్లంపల్లిలోనూ ఇదే విధంగా సీఎంఆర్​ఎఫ్​లో భారీగా గోల్​మాల్​ జరిగినట్టు తెలుస్తోంది.  సీఎంఆర్​ఎఫ్​ కోసం పైరవీలు చేసినందుకు లోకల్​ లీడర్లు బిల్లును బట్టి రూ.10వేల నుంచి రూ.50వేల వరకు కమీషన్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. పలువురు వ్యక్తుల పేరిట బోగస్​ బిల్లులు సృష్టించి సీఎంఆర్​ఎఫ్​ను స్వాహా చేస్తున్నారు. అధికార పార్టీ లీడర్లు పార్టనర్లుగా ఉన్న మంచిర్యాలలోని ఒక ప్రైవేట్​ హాస్పిటల్​, వారికి సంబంధించిన మరో హాస్పిటల్​తో పాటు కరీంనగర్​లోని ప్రైవేట్​ హాస్పిటళ్ల నుంచి ఈ బోగస్​ బిల్లులు తీసుకుంటున్నట్టు 
సమాచారం. 

 దరఖాస్తు  చేయకుండానే చెక్కులు..

 బెల్లంపల్లి మండలం బుధాకలాన్​కు చెందిన  ఓ వ్యక్తి కొన్ని నెలల కింద కంటి ఆపరేషన్​ చేయించుకున్నాడు. కానీ అతడు సీఎంఆర్​ఎఫ్​కు దరఖాస్తు చేయలేదు. కానీ అతడి భార్య పేరిట అక్రమార్కులు బోగస్​ బిల్లులు తయారుచేసి సీఎంఆర్​ఎఫ్​ డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో  కిడ్నీ ట్రీట్​మెంట్​ చేయించుకు న్నాడు.  రూ.82 వేల బిల్లు కాగా సీఎంఆర్​ఎఫ్​కు దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్​ అయింది.  నాయకుడు అడిగిన డబ్బులు ఇవ్వనందుకే తన దరఖాస్తును రిజెక్ట్​ చేయించినట్టు బాధితుడు ఆరోపిస్తున్నాడు.  ఒక్క బుధాకలాన్​ లోనే  రూ.అరకోటికిపైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది.  అలాగే వేమనపల్లికి చెందిన ఓ మండల లీడర్​ పలువురి పేరిట బోగస్​ బిల్లులు పెట్టి చెక్కులు డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్​లో ఉండే ఎమ్మెల్యే పీఏ ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్టు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవిని వివరణ కోరగా.. సీఎంఆర్​ఎఫ్​లో అక్రమాలు జరిగిన విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. ఎమ్మెల్యే చిన్నయ్య వివరణ కోసం ఫోన్​ చేస్తే స్పందించలేదు.