సామాన్యుడిలా ట్యాంక్ బండ్పై సీఎం రేవంత్ రెడ్డి: భక్తులతో మమేకం.. నిమజ్జనంలో సందడి

సామాన్యుడిలా ట్యాంక్ బండ్పై సీఎం రేవంత్ రెడ్డి: భక్తులతో మమేకం.. నిమజ్జనంలో సందడి

హైదరాబాద్‌: హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనాలు నేటితో ముగుస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్నారు. గణేష్‌ నిమజ్జనాలను స్వయంగా పరిశీలించారు. క్రేన్‌ నంబర్-5 దగ్గర నిమజ్జనాలను సీఎం కొద్దిసేపు చూసి అక్కడ నుంచి వెళ్లారు. పోలీసులు, సిబ్బందితో నిమజ్జన ఏర్పాట్లపై మాట్లాడారు. సీఎం ఎలాంటి కాన్వాయ్ లేకుండా, రెండు మూడు వాహనాల్లో సింపుల్గా ఎన్టీఆర్ మార్గ్ దగ్గరకు వెళ్లి నిమజ్జనాలను వీక్షించడం విశేషం. ముఖ్యమంత్రి ఆకస్మికంగా అక్కడకు వెళ్లడంతో సీఎంను చూసి సామాన్యులు ఆయనతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. అందరినీ పలకరిస్తూ.. షేక్ హ్యాండ్ ఇస్తూ ముఖ్యమంత్రి ముందుకు కదిలారు.

సామాన్య భక్తులతో సీఎం ఫొటోలు దిగి, సెల్ఫీలు ఇస్తూ అందరితో సరదాగా ఉన్నారు. పోలీసులు అలర్ట్గా ఉండటంతో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదు. నిమజ్జనాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు సూచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు. సీఎం ప్రయాణించిన వాహనంతో పాటు రెండు మూడు వాహనాలు మాత్రమే ఆయన కాన్వాయ్లో ఉండటం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా చేసిన ఈ పర్యటనతో నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ వెళ్లిన భక్తులు పనిలో పనిగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా చూశారు.