సీఎం సభతో కాంగ్రెస్​ ​లో జోష్.. జిల్లా రైతుల అండతోనే హైకమాండ్​ దృష్టిలో పడ్డా: సీఎం రేవంత్ రెడ్డి

సీఎం సభతో కాంగ్రెస్​ ​లో జోష్.. జిల్లా రైతుల అండతోనే  హైకమాండ్​ దృష్టిలో పడ్డా: సీఎం రేవంత్ రెడ్డి
  •     టీపీసీసీ ​ ప్రెసిడెంట్​ కావడానికి పునాది అయ్యారని కితాబు
  •     జీవన్​రెడ్డికి వేసే ఓటు నాకు వేసినట్లేనని వ్యాఖ్య 
  •     ఇందూర్​ సభలో సీఎం రేవంత్​రెడ్డి

నిజామాబాద్​, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల ప్రచార సభ కోసం  సోమవారం జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్​రెడ్డి కాంగ్రెస్​ క్యాడర్​లో మస్త్​ జోష్​ నింపారు. ఆయన స్పీచ్​లోని ప్రతి కామెంట్​కు కార్యకర్తలు, ప్రజల నుంచి స్పందన లభించింది.  పార్టీ లీడర్​గా జిల్లాతో ఉన్న రిలేషన్​షిప్​కు తోడు  పాలిటిక్స్​లో మరింత ఎదగడానికి దోహదపడిన అంశాలను ప్రస్తావించి ఉత్సాహపర్చారు.  

దాశరథి రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణతో షురూ చేసి బాక్సింగ్ ఛాంపియన్​ నిఖత్​జరీన్​, ఎవరెస్ట్​ శిఖరాన్ని అధిరోహించిన మలావత్​ పూర్ణ, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాజీ ఎంపీ, ఎం. నారాయణరెడ్డి, అర్గుల్ రాజారామ్, జిల్లాతో సంబంధమున్న సదాలక్ష్మీ, ఈశ్వరీబాయి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్ ​డి. శ్రీనివాస్​, నిజాయతీ రాజకీయాలతో వన్నె తెచ్చారంటూ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్​రావు తదితరులను గుర్తు చేశారు.  

నా ఐడెంటిటీకి నిజామాబాద్ జిల్లానే కారణం 

ఎండ వేడిని ఉక్కబోతను ఏమాత్రం లెక్కచేయక సీఎం కోసం ప్రజలు ఓపికతో ఎదురుచూశారు. పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్​ల నుంచి భారీగా జనం తరలివచ్చారు. 30 జనవరి 2021 న ఆర్మూర్​లో పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర కోసం రైతులు చేసిన దీక్షలో పాల్గొనడానికి తాను మామూలు వ్యక్తిగా వచ్చిన సంగతి గుర్తు చేసుకున్నారు. ఘన స్వాగతం పలికి తన నాయకత్వంలో కాంగ్రెస్​లో పనిచేయడానికి వారు చూపిన నమ్మకం, విశ్వాసం సోనియాగాంధీ దృష్టిలో పడేసేలా చేసిందని రేవంత్​ అన్నారు.  

హైకమాండ్​లో తన మొదటి ఐడెంటిటీకి కారణమైన నిజామాబాద్​ జిల్లా స్పెషల్​ అని కామెంట్​ చేశారు. పౌరుషం గల రైతులు, కార్యకర్తలున్న ఇందూర్​ గడ్డ తన గుండెలో పర్మనెంట్​గా కొలువైందన్నారు.  ఎంపీగా జీవన్​రెడ్డికి వేసే ఓటు తనకు వేసినట్లేనని క్యాడర్​ను ఉత్తేజపర్చారు.  బీజేపీ ఎంపీ అర్వింద్​, బీఆర్​ఎస్​ క్యాండిడేట్​ బాజిరెడ్డి గోవర్ధన్​పై విమర్శలు చేశారు.  ఆయనకు ఓటు వేస్తే కొడుకులకు మళ్లీ హఫ్తా ఇవ్వాల్సి వస్తుందన్నారు. 

14 సీట్లు గెలుస్తం..ప్రచార కమిటీ చైర్మన్​ మధుగౌడ్​యాష్కీ

కేసీఆర్​ దుర్మార్గపు పాలనపోయి కాంగ్రెస్​ ప్రజాపాలన వచ్చిన టైంలో జరుగుతున్న పార్లమెంట్​ ఎలక్షన్​లో 14  సీట్లు గెలువబోతున్నామని  కాంగ్రెస్​ ప్రచార కమిటీ చైర్మన్​ మధుగౌడ్​యాష్కీ అన్నారు. 120 రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు అమలు చేశామన్నారు. స్టేట్​లో ఇక కాంగ్రెస్​ పనైపోయిందని ప్రచారం జరుగుతున్న టైంలో రేవంత్​రెడ్డి తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చిన మొనగాడని పేర్కొన్నారు. 2004లో విదేశాల నుంచి జిల్లాలో అడుగుపెట్టినప్పుడు ప్రజలు ఆదరించి రెండుసార్లు ఎంపీగా  గెలిపించారన్నారు.   

నామినేషన్​ వేయని జీవన్​రెడ్డి

ఎన్నికల నామినేషన్​ వేయడానికి జీవన్​రెడ్డి రెడీ కాగా సీఎం రేవంత్​రెడ్డి ఆలస్యంగా రావడంతో  కుదరలేదు.  ఆదిలాబాద్​ టూర్​ ముగించుకొని రేవంత్​  ప్రయాణించిన హెలిక్యాఫ్టర్ ల్యాండ్​ అయ్యేసరికి మధ్యాహ్నం 3.15 గంటలైంది. నామినేషన్​లు వేసే టైం మధ్యాహ్నం 3 గంటలకే ముగియడంతో వేయలేకపోయారు. హెలిక్యాప్టర్​లో రేవంత్​రెడ్డి వెంట మంత్రి శ్రీధర్​బాబు వచ్చారు. కలెక్టరేట్​లోని హెలిపాడ్​లో వారిని రిసీవ్​ చేసుకున్న షబ్బీర్అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి, అభ్యర్థి జీవన్​రెడ్డి నేరుగా పాత కలెక్టరేట్​లోని సభా మైదానానికి చేరుకున్నారు. సీఎం రేవంత్​రెడ్డి స్పీచ్​ అరగంట కొనసాగగా  మధ్యలో 3 నిమిషాలు హిందీలో ప్రసంగించారు.   

ఇక లైఫ్​ ప్రజాసేవకే అభ్యర్థి జీవన్​రెడ్డి

ప్రజల సేవకే ఇక తన జీవితం అంకితం చేశానని పార్లమెంట్​ అభ్యర్థి జీవన్​రెడ్డి అన్నారు.  రాజకీయాల్లో క్రమశిక్షణ ఉంటేనే డెవలెప్​మెంట్​ సాధ్యమన్నారు. ఎన్డీయే గవర్నమెంట్​తో మంచి సంబంధాలున్నా  ఎంపీగా కవిత పసుపు, చెరకు  రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు.  షుగర్​ ఫ్యాక్టరీలు క్లోజ్​ చేయించారన్నారు.  ఎంపీగా అర్వింద్​ అదే బాటలో ట్రావెల్​ చేశారన్నారు.  

ఆయన నిర్లక్ష్యంతో పసుపు పంట సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు.  ఇప్పుడు బుద్ధిగా ఉంటాను మరో ఛాన్స్​ ఇవ్వమని కోరుతున్న ఆయన్ను నమ్మొద్దన్నారు.  తాను గెలిచాక ఇందూర్​ను స్మార్ట్​ సిటీ చేస్తానని, రైల్వే సర్వీస్​లు పెంచుతానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. గవర్నమెంట్​సలహాదారుడు షబ్బీర్​అలీ, తాహెర్​, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, డి. రాజేశ్వర్, డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి, అన్వేశ్​ రెడ్డి, నగేశ్​ రెడ్డి, ఏబీ చిన్నా, వినయ్​ రెడ్డి, ముత్యాల సునీల్​ రెడ్డి, కేశ వేణు, అంతిరెడ్ది రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.