గనులు, ఓఆర్ఆర్​ను ప్రైవేటుకు అమ్మిన వ్యక్తే  .. హక్కులపై మాట్లాడుతున్నడు: సీఎం రేవంత్ రెడ్డి

గనులు, ఓఆర్ఆర్​ను ప్రైవేటుకు అమ్మిన వ్యక్తే  .. హక్కులపై మాట్లాడుతున్నడు: సీఎం రేవంత్ రెడ్డి
  • కేటీఆర్​పై ‘ఎక్స్’​లో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్​
  • అరబిందో, అవంతిక కంపెనీలకు సింగరేణి గనులు కట్టబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే
  • రాష్ట్ర భవిష్యత్తు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే సురక్షితమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బొగ్గు గనుల వేలంపై గత ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్​లో ఘాటుగా స్పందించారు. కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. అటు సింగరేణిని, ఇటు ఔటర్ రింగ్ రోడ్ ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. పదేండ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను మీరు పట్టించుకోలేదని.. కనీసం వినడానికి కూడా ఇష్టపడలేదన్నారు. ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదన్నారు.

అయినప్పటికీ.. మీలో మార్పు రావాలని కోరుకుంటూ.. వాస్తవాలను మరోమారు తెలియజేస్తున్నామని ఎక్స్​లో తెలిపారు. ‘‘మన సంస్థల ప్రైవేటైజేషన్​ను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం, గత బీఆర్​ఎస్ ప్రభుత్వం ప్రయత్నించినా సరే.. కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను మొట్టమొదటి సారి వేలం వేసింది. రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది మీ ప్రభుత్వ హయాంలోనే. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే. అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదు? మా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు సింగరేణి గనులను  ప్రైవేటైజ్​చేయడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారు.

మీ ప్రియమైన అవంతిక, అరబిందో కంపెనీలకు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు” అని సీఎం రేవంత్​ రెడ్డి పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, వారి ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటేనని స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో సురక్షితమని.. మన బొగ్గు.. మన హక్కు. కాపాడి తీరుతామన్నారు. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడుతామని తెలిపారు.

నా జీవితంలో.. ఈ రోజు చరిత్రాత్మకం

రైతుల రుణమాఫీపై శుక్రవారం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం తన జీవితంలో చరిత్రాత్మకం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్​లో ట్వీట్ చేశారు. ‘‘మే 6, 2022 నాడు వరంగల్ వేదికగా లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ. నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాటను నిలబెట్టుకుంది. తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది’’ అని రేవంత్ పోస్ట్ చేశారు.