
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మార్చేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. పటాన్ చెరులో నీలం మధుకు మద్దతుగా ప్రచారం చేశారు రేవంత్. బీజేపీ మతాలు,,కులాల మధ్యన చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. పటాన్ చెరు ఒక మినీ ఇండియా అని అన్నారు. అన్ని కులాలు,మతాలకు అతీతంగా దేశానికే ఉత్పత్తిని అందిస్తోంది పారిశ్రామిక వాడ. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మిషన్ భగీరథ నీళ్లు కూడా రాలేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రామిరెడ్డి వేలాది మంది రైతులను మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లో నిండా ముంచిన దుర్మార్గుడని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఉంటూనే కేసీఆర్ మళ్లీ ఎంపీగా కొట్లాడటం విడ్డూరమన్నారు. వందల కోట్ల రూపాయలు కేసీఆర్ కు, హరీశ్ కు ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.
బీజేపీ తెలంగాణకు ఇచ్చేందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..ఇవేవీ తెలంగాణకు ఇవ్వలేదన్నారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. బీజేపీ హిందూ,ముస్లీం ఒట్లను చీల్చి రక్తంలో ఓట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. మెదక్ అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలన్నారు. నీలం మధును మెదక్ నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. బడుగు బలహీన వర్గాల గొంతుకును పార్లమెంట్ కు పంపించాలని పిలుపు నిచ్చారు.