
- ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్ష
- మంత్రులు వివేక్, దామోదర నుంచి వివరాలు సేకరణ
- సహాయ చర్యలు, భవిష్యత్ కార్యాచరణ సిఫార్సులకు కమిటీ
- నేడు ప్రమాద స్థలికి వెళ్లనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, వెలుగు: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయ చర్యలను ఆయన ఎప్పటికప్పుడు అక్కడున్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహను అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలపై డీజీపీ, సీఎస్తో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సహాయ చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్ట్మెంట్ పీఎస్, హెల్త్ సెక్రటరీ, ఫైర్సర్వీసెస్ అడిషనల్ డీజీని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మి కుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పాశమైలారంలోని ప్రమాద స్థలికి వెళ్లనున్నారు.