
- సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటది
- గద్దరన్న స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నం: సీఎం రేవంత్రెడ్డి
- సర్కార్ కఠినంగా కనిపించినా.. అభిమానంగా చూసుకుంటది
- రాష్ట్రాభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం
- ప్రభుత్వం తరఫున సినీ అవార్డులు ఇవ్వడం 14 ఏండ్ల కింద ఆగింది
- తిరిగి మేం గద్దర్ పేరిట ఇస్తున్నం.. ఆయన వేగు చుక్క
- తెలంగాణ రైజింగ్–2047లో సినీ ఇండస్ట్రీకి ఒక చాప్టర్
- రాబోయే 22 ఏండ్లు క్రియాశీలక రాజకీయాల్లో ఉంట
- నేను సాధించాలనుకున్న దాంట్లో ఎక్కడా ఫెయిల్ కాలే
- 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ
- అవుతుందని ధీమా.. ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం
హైదరాబాద్, వెలుగు: సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ‘‘ప్రభుత్వం కఠినంగా కనిపించినా, మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటు అందిస్తుంది. బాలీవుడ్, హాలీవుడ్ కూడా తెలంగాణ గడ్డ మీదికి రావాలి. దీని కోసం మీరందరూ కృషి చేయాలి” అని తెలుగు సినీ కళాకారులకు ఆయన సూచించారు. తెలంగాణ అభివృద్ధిలో సినిమా ఇండస్ట్రీ భాగస్వామ్యం కావాలన్నారు.
‘‘గతంలో ఏమైనా అంశాలు ఉన్నా, అవన్నీ పక్కకు పెట్టి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. తెలంగాణ డెవలప్మెంట్ కోసం పనిచేద్దాం” అని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హెచ్ఐసీసీలో శనివారం ఘనంగా జరిగింది. ఉమ్మడి ఏపీలో సినీ పరిశ్రమ కోసం అవార్డులు ఉండగా.. తెలంగాణ వచ్చాక తిరిగి ప్రభుత్వం తరఫున అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి. 2014 నుంచి 2024 వరకు సినిమా అవార్డులను ఈ వేదికపై అందజేశారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరై.. పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్– 2047లో సినిమా ఇండస్ట్రీ కూడా ఓ చాప్టర్ కావాలని ఆకాంక్షించారు. రాబోయే 22 ఏండ్లు తాను క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని, ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
ఏం కావాలో చెప్పండి
టాలీవుడ్ను అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను, ప్రోత్సాహకాలను, వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఏం కావాలో చెప్పాలని సూచించారు. ‘‘2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పటికి మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదగాలి. అందులో తెలంగాణ ముందు వరుసలో ఉండాలి. ఇందుకోసం సినీ పరిశ్రమ కూడా తన వంతు పాత్ర పోషించాలి. ఐటీ, ఫార్మా, డిఫెన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ కూడా గొప్ప పరిశ్రమగా రాణించాలన్నది మా ప్రభుత్వ ఆలోచన’’ అని తెలిపారు. తాను ప్రధానికి చెప్పిన 2047 విజన్లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా నడిపిస్తామని సీఎం పేర్కొన్నారు.
‘‘నేను ఇంతవరకు ఆలోచన చేసినదాంట్లో, సాధించాలనుకున్న దాంట్లో ఎక్కడా ఫెయిల్ కాలేదు. నా సక్సెస్ రేషియో 100 శాతం. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్కు వస్తుంది. నిర్మాత అశ్వినీదత్ కుమార్తె నాకు బాగా తెలుసు. 20–25 ఏండ్ల కిందటే ఆమెకు చెప్పిన. రెడ్డి పిలగాడిని పెండ్లి చేసుకుంటవని. అట్లనే జరిగింది. నేను ఒక్కసారి చెప్తే వంద శాతం జరుగుతుంది. 2047 ఆగస్టు 15న నా కండ్లతో 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చూసినప్పుడు ఆనందంగా మళ్లీ సినీ పరిశ్రమ వేదికను ఏర్పాటు చేసి.. సంబురంగా జరుపుకుంటాం” అని ఆయన అన్నారు. హాలీవుడ్ అంటే అమెరికా, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నామని గుర్తుచేశారు.
‘‘ఈ రోజు నేను డైరెక్టర్ రాజమౌళిని అడుగుతున్నా.. ప్రపంచమే గుర్తించే అద్భుతమైన సినిమాలు తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఈ గడ్డ మీదకు ఎందుకు తీసుకురారు? హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి. మీకు ఏం కావాలో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది” అని ఆయన భరోసా ఇచ్చారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్ పరిశ్రమలను ప్రోత్సహించిన విధంగానే సినీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తామని.. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రణాళికలతో రావాలని సూచించారు. విజన్ డాక్యుమెంట్ 2047 తెలంగాణ రైజింగ్లో ఒక చాప్టర్ను సినీ పరిశ్రమకు కేటాయిస్తామని ఆయన ప్రకటించారు.
14 ఏండ్ల కింద ఆగిపోయినా..
కాంగ్రెస్ ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎప్పుడూ గౌరవించాయని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘‘సినీ పరిశ్రమకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా, అభినందించాలనే ఆలోచనతో 60 ఏండ్ల కిందట్నే 1964లో అవార్డులను ఇవ్వాలని ఆలోచించి నంది అవార్డులను ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ఆ సంప్రదాయాన్ని 14 ఏండ్ల కిందటి వరకు నిర్వహించుకున్నాం. ఉత్తమ నటుడిగా మొదటి నంది అవార్డును అక్కినేని నాగేశ్వర్ రావు అందుకున్నారు.
ఆనాటి ప్రభుత్వం ఆ గొప్ప నటుడికి సముచితమైన గౌరవం ఇచ్చింది. వివిధ కారణాలతో 14 ఏండ్ల కిందట ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించాలనే ఆలోచనతో మా ప్రభుత్వం నంది అవార్డులను తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులుగా ఇస్తున్నది. అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు, శుభాకాంక్షలు’’ అని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు. గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నై అని మాట్లాడుకునేవారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
‘‘ఈనాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ, హైదరాబాద్ వేదిక అని అందరూ నిరూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు. సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు.. రెండో తరం కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు.. మూడో తరం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. నాలుగో తరం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారెందరో” అని ఆయన తెలిపారు.
విద్యార్థి దశలో తనకు పరిచయం ఉన్న కొందరు ఇప్పుడు సినీ పరిశ్రమలో రాణిస్తుండటం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు, సినీ నటులు, కళాకారులు పాల్గొన్నారు. కాగా, 2024కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35.. చిన్న కథ కాదు) గద్దర్ అవార్డులను సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. కత్తి కాంతారావు పురస్కారాన్ని నటుడు విజయ్ దేవరకొండ అందుకున్నారు. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందించారు. 2024కు గాను ఉత్తమ చిత్రాలతోపాటు అన్ని విభాగాల్లో కళాకారులకు పురస్కారాలు ఇచ్చారు.
గద్దర్ అన్న స్ఫూర్తితోనే తెలంగాణ
తెలంగాణకు ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చని, ఫార్చూన్ 500 కంపెనీలలో 85 కంపెనీల ఫుట్ఫాల్స్ తెలంగాణలో ఉన్నాయని, ఇది దేశంలో ఏ సిటీలోనూ లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘హైదరాబాద్కు బెంగళూరు, అమరావతి, ముంబై, ఢిల్లీ పోటీ కాదు.. వాళ్లంతా మా మిత్రులు. మా విజన్ జపాన్, చైనా, సౌత్ కొరియాలోని టెక్నాలజీతో పోటీ పడటమే” అని తెలిపారు. గద్దర్ ఒక చైతన్యం, విప్లవం, వేగుచుక్క అని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘జయ జయహే తెలంగాణ రాష్ట్రగీతాన్ని అందించిన అందెశ్రీ, ‘జై బోలో తెలంగాణ’ అందించిన గద్దరన్న మాకు స్ఫూర్తి” అని తెలిపారు. హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్ ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ అవార్డు వరకు రాణించాడని, తప్పకుండా రాహుల్ సిప్లిగంజ్కు అవార్డు ఇవ్వాలన్నారు.