- ఆహ్వాన పత్రిక అందజేసిన ఈవో వెంకటరావు
యాదగిరిగుట్ట, వెలుగు: ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం, అధ్యయనోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ ఈవో వెంకటరావు బుధవారం ఆహ్వానించారు. ఈ మేరకు ఈవో ఆఫీస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చక బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎంకు ఈవో వివరించారు.
అనంతరం ఆలయ అర్చక బృందం సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం చేయగా.. ఈవో వెంకటరావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.
