- సహకరించకపోతే కొట్లాడ్తం.. కడిగిపారేస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- రక్షణ శాఖను కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ఇబ్బంది పెట్టింది
- ప్రజల అవసరాన్ని మర్చిపోయి కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుంది
- ఎలివేటెడ్ కారిడార్ను మేం తీసుకొస్తే..
- బీఆర్ఎస్ పోరాట ఫలితమని కేటీఆర్ చెప్పుకుంటున్నడు
- పోరాటం అంటే ట్విట్టర్లో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడు కాదు
- కేంద్ర నిధుల కోసం ధర్నా చౌక్ దగ్గర కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి
- అట్ల దీక్ష చేస్తే మా కార్యకర్తలే కంచె వేసి ఆయనను కాపాడుకుంటరు
- బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్కు డ్రగ్స్, పబ్స్ తప్ప ఏమీ రాలేదని విమర్శ
- రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు : ప్రజల అవసరాల కోసమే తాను ఒక మెట్టు దిగానని, రాజకీయాల కోసం కాదని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతానని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకొని రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును పక్కన పడేసిందని మండిపడ్డారు. ‘‘దాదాపు నలభై ఏండ్ల నుంచి హైదరాబాద్ సహా మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలు రాకపోకలకు తిప్పలు పడుతున్నా.. ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నా గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు.
కేంద్రానికి సమస్యను వివరించి పరిష్కరించాల్సింది పోయి ఇబ్బందులు పెట్టింది” అని అన్నారు. పదేండ్లపాటు గత బీఆర్ఎస్ సర్కార్ అవలంబించిన దిక్కుమాలిన విధానాల వల్ల ప్రజలకు శిక్ష పడిందని, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఫామ్హౌస్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారని ఆయన ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో సంప్రదింపులు జరిపి, సమస్యను వివరించి పరిష్కరించామన్నారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్కు సీఎం రేవంత్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత తమ దృష్టి అంతా అభివృద్ధిపైనేనని స్పష్టం చేశారు.
రక్షణ శాఖను కూడా ఇబ్బంది పెట్టిన్రు
వికారాబాద్ జిల్లా పూడూరులో నేవీ విభాగానికి చెందిన భూముల కేటాయింపులో, చాంద్రాయణగుట్టలో రక్షణ శాఖ భూముల లీజ్ రెన్యూవల్ విషయంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా స్పందించక రక్షణ శాఖను ఇబ్బంది పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు కూడా చెప్పారని గుర్తుచేశారు. ‘‘రక్షణ శాఖ అంటే దేశభద్రతకు సంబంధించింది.
ఇందులో రాజకీయాలకు తావుండొద్దని కేంద్ర ప్రభుత్వానికి మేం అధికారంలోకి రాగానే సహకరించినం. ఆ భూములను అప్పగించినం. ఎలివేటెడ్ కారిడార్ గురించి ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి చెప్పినం. ప్రజల సమస్యను వివరించినం. కేంద్రం సానుకూలంగా స్పందించి మంజూరు చేసింది” అని స్పష్టం చేశారు.
కేంద్ర నిధుల కోసం దీక్ష చెయ్..
‘‘మేం అనుమతులు తీసుకొస్తే ఆయన(కేటీఆర్) సొంత పోరాటం అని చెప్పుకుంటుండు. ఏం పోరాటం చేసిండు? ఈ వేదికగా కేటీఆర్ కు నేను సూచన చేస్తున్నా.. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, కేంద్రం నుంచి నిధుల కోసం ఇందిరా పార్కు ధర్నాచౌక్ దగ్గర ఆమరణ దీక్ష చెయ్. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో.. అని తేలే వరకు దీక్ష చెయ్” అని సీఎం రేవంత్రెడ్డి హితవు పలికారు. కేటీఆర్ దీక్షకు దిగితే తమ కార్యకకర్తలే కంచె వేసి ఆయనను కాపాడుతారని చెప్పారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్
కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని చెప్పారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఈ కారిడార్ ముఖద్వారంగా ఉంటుందని, రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్ లోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని, కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతామని, కడిగిపారేస్తామని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు.
పదేండ్లలో గంజాయి, డ్రగ్స్ పబ్బులు తప్ప ఏం రాలే
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి పని చేశారా? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘‘ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది గత కాంగ్రెస్ పాలనలోనే. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏమీ రాలేదు. వాళ్లు సాధించిన అభివృద్ధి అది” అని విమర్శించారు. ఐటీ కంపెనీలు, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో, అంతర్జాతీయ ఎయిర్పోర్టులు, కృష్ణా జలాలు, గోదావరి జలాలు, చివరికి కేటీఆర్ సెల్ఫీలు దిగి సెల్ప్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
మొత్తం 18.10 కి.మీ. పొడవు.. ఆరు వరుసలు..
- రాజీవ్ రహదారిపై కారిడార్ సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై వెస్ట్ మారేడ్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్పేట్ సమీపంలోని ఓఆర్ ఆర్ జంక్షన్ వద్ద ముగుస్తుంది.
- మొత్తం కారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 11.12 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.3 కి.మీ ఉంటుంది. మొత్తం 287 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు.
- ఎలివేటెడ్ కారిడార్పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్ వద్ద), అల్వాల్ వద్ద (0.310 కిలోమీటర్ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు.
- ఈ కారిడార్తో ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లు పడిన కష్టాలు తీరుతాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు రూ. 2,232 కోట్ల వ్యయంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నారు.
- ఎలివేటెడ్ కారిడార్కు అవసరమైన భూమి: 197.20 ఎకరాలు. ఇందులో రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు.. ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు.
- ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ ఫర్ డే -పీసీయూ) పయనిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్ ఆర్ జంక్షన్ సమీపంలో 35,825గా ఉంది. అసలే ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు, ప్రయాణికులు హడలిపోతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలిసిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ బాధలు తొలగిపోతాయి.