
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఫ్యూచర్సిటీకి సీఎం రేవంత్రెడ్డి ఆదివారం (సెప్టెంబర్ 28) శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూర్మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) భవన నిర్మాణానికి ఆయన పునాదిరాయి వేశారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని ఎఫ్సీడీఏకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎఫ్సీడీఏ భవనానికి, రావిర్యాల నుంచి ఆమనగల్వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్రేడియల్ రోడ్–1 నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు.
ఈ బృహత్తర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, హైదరాబాద్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది.
ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీ నిర్మించనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది. మహానగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి తగ్గట్టు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుందని ప్రభుత్వం చెప్తున్నది.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం ‘సింగిల్ విండో సిస్టమ్’ అమలు చేయనుంది. ఎఫ్సీడీఏ కార్యాలయంలోనే భవన నిర్మాణం, లే అవుట్లు, పారిశ్రామిక అనుమతులు వంటి అన్ని రకాల క్లియరెన్స్లు ఒకేచోట లభిస్తాయి. సుపరిపాలన దిశగా ఇది సరికొత్త మార్పు అని.. ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులకు తరలివస్తాయని ప్రభుత్వం పేర్కొంటున్నది.
ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేలా సూపర్-ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. మహానగరాలకు అత్యంత ముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. ఈ దిశగా భారత్ ఫ్యూచర్ సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)ను కలుపుతూ వంద మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను ప్రభుత్వం నిర్మించనుంది. రావిర్యాల నుంచి అమనగల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నెం.1కు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు.
రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలను కలిపే కొత్త ఈస్ట్-వెస్ట్ ట్రంక్ రోడ్డు నిర్మిస్తారు. టోల్ ఫీజు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్-ఫ్లో మార్గాలను ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మెట్రో ఫేజ్ 2–బీకి అనుసంధానం చేయనున్నారు.