
- ప్రారంభించనున్న సీఎం ?
- మొదటి దశలో 60 క్యాంటీన్లలో..
- దశలవారీగా 150 సెంటర్లకు విస్తరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్లోని ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5 కే భోజనం అందిస్తున్న జీహెచ్ఎంసీ .. రూ.5కే బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం 139 చోట్ల రూ.5 భోజనం పెడుతుండగా, తొలి దశలో బ్రేక్ ఫాస్ట్ స్కీంను 60 క్యాంటీన్లలో అందుబాటులోకి తేనున్నారు.
సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి పౌష్టికారం అందించేందుకు జీహెచ్ఎంసీ మెనూ సిద్ధం చేసింది. పూర్తిగా మిల్లెట్స్ తో తయారు చేయనున్న ఈ ఒక్కో టిఫిన్ కు రూ.19 ఖర్చవుతుండగా, ఇందులో రూ. 5 ప్రజల నుంచి వసూలు చేస్తుండగా, మిగిలిన రూ.14ను జీహెచ్ఎంసీ భరించనున్నది. రాను రాను ఈ క్యాంటీన్ల సంఖ్యను 150కి పెంచనున్నారు.
అన్నిచోట్లా కొత్త స్టాల్స్
ఇది వరకు ఉన్న స్టాల్స్ పూర్తిగా డ్యామేజ్కావడంతో అన్ని చోట్లా రూ.11.43 కోట్ల వ్యయంతో కొత్త స్టాల్స్ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రం పరిశుభ్రంగా ఉండేలా, నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారుతుందని ప్రభుత్వం చెప్తోంది. ప్రస్తుతం రూ.5 కే నాణ్యమైన భోజనాన్ని అందజేస్తున్న హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ ఈ బ్రేక్ఫాస్ట్స్కీం బాధ్యతలు తీసుకుంది.