
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్గా మారిన బనకచర్ల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రం ఏపీతో వివాదాలు కోరుకోవట్లేదని.. కానీ ఎవరి కోసమో మా హక్కులు వదులుకోబోమని తేల్చి చెప్పారు. 2025, జూన్ 23న కేబినెట్ భేటీ నిర్వహించి.. ఇందులో బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చిస్తామన్నారు.
ఆ తర్వాత అవసరమైతే మేమే ఒక అడుగు ముందుకేసి బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ గవర్నమెంట్ని చర్చలకు ఆహ్వానిస్తామన్నారు సీఎం రేవంత్. చర్చల ద్వారానే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరోజు కాకుంటే.. నాలుగు రోజులు అయినా కూర్చొని చర్చిద్దామన్నారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా డిస్కస్ చేద్దామన్నారు.
పొరుగు రాష్ట్రాతలో తెలంగాణ అనవసరమైన వివాదాలను కోరుకోవడం లేదని.. పైన ఉన్న కర్ణాటకతో సత్సబంధాలు కొనసాగిస్తున్నట్లే ఏపీతోనూ మంచి రిలేషన్ కొనసాగించుకోవాలనేది మా విధానమని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి కేంద్రాన్ని సంప్రదించే ముందు ఏపీ సర్కార్ తెలంగాణ అభిప్రాయాన్ని అడిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు.
బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంటును అడ్డంపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోందని.. ఇప్పుడు గోదావరి జలాల ఇష్యూని చచ్చిపోయిన బీఆర్ఎస్ సంజీవనిలా వాడుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణకు సాగునీటిలో విషయంలో అన్యాయం చేసిందే కేసీఆర్, హరీష్ రావు అని ఫైర్ అయ్యారు. బనకచర్ల ప్రాజెక్టుకు బీజం పడిందే 2016 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అని గుర్తు చేశారు.
2016-2018లో బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని.. అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదు..? ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఎందుకు కోర్టులను ఆశ్రయించలేదని ప్రశ్నించారు.
గోదావరి వరద జలాలను ఏపీకి తరలించుకుపోయేందుకు అపెక్స్ కౌన్సిల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు చెప్పే అబద్ధాలకు దేవుడు కూడా ఆశ్చర్యపోతాడని, నేనేనా వీళ్లను సృష్టించిదని షాక్ అవుతాడని ఎద్దేవా చేశారు. హరీష్ రావు అతి తెలివితో అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు తాటి చెట్టులా పెరిగాడు గానీ సరియైన నాలెడ్జి లేదన్నారు.
నీటి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడానికి ప్రధాన కారకుడు హరీష్ రావు అని ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం. ఏపీలో మళ్ళీ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబుకు గోదావరి వరద జలాల అవసరం. అలాగే తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి బీఆర్ఎస్కు బనకచర్ల ఇష్యూ అవసరం. వీరంతా కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కేబినెట్ ఆమోదంతోనే కాలేశ్వరం డిజైన్లు రూపొందించారన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డికి ట్యూషన్ మాస్టర్ కేసీఆర్.. కేటీఆర్కు లైజనింగ్ ఆఫీసర్ కిషన్ రెడ్డి అని సీఎం రేవంత్ సెటైర్ వేశారు.