![దొడ్డి కొమురయ్య ఉద్యమ స్పూర్తిని కొనసాగిస్తం: సీఎం రేవంత్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/04/26_BeVOWclQK3.jpg)
హైదరాబాద్, వెలుగు: నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన త్యాగాన్ని, ఉద్యమ స్ఫూర్తిని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం తెలిపారు. ఆయన త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పేద కుటుంబాలకు రెండొందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు వివరించారు. నియామకాల్లో సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు.