
- ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా?కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు
- మీ ఫ్యామిలీ పంచాదిలోకి నన్ను లాగొద్దు
- మహబూబ్నగర్ జిల్లా వేములలోఎస్జీడీ కార్నింగ్ కంపెనీలో రెండో యూనిట్ ప్రారంభం
అడ్డాకుల, వెలుగు: తాను ఎవరి వెనకో ఉన్నట్టు బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతున్నారని, ఆ చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నేను లీడర్ని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడుపుతా” అని పేర్కొన్నారు. కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోట్లలాగా బీఆర్ఎస్ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని ఎద్దేవా చేశారు. కుటుంబ పంచాయతీలోకి తనను లాగొద్దని అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని ఎస్జీడీ ఫార్మా రెండో యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒకరు హరీశ్ రావు వెనుక నేను ఉన్నానంటున్నారు. మరొకరు కవిత వెనుక ఉన్నానంటున్నారు. ఇలాంటి పనికిమాలిన వారి వెనుక నేనెందుకుంటా.. ఎలా ఉంటా? నేను లీడర్ను.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల వెనుక ఉంటా” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని బతకనివ్వొద్దని ఆనాడు శాసనసభ్యులుగా గెలువకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని గుర్తుచేశారు.
ఇప్పుడు వాళ్లే కడుపులో కత్తులుపెట్టుకొని కౌగిలించుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. సొమ్ముల పంపకాల్లో తేడాలొచ్చి ఒకరిపై ఒకరు యాసిడ్ పోసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించి.. రాష్ట్ర సాధన ఉద్యమంలో తోడున్నారని, కానీ.. ఆయన సీఎం అయ్యాక ఈ జిల్లాకు న్యాయం చేయలేదన్నారు. ఎన్నో దుర్మార్గాలు చేసిన వారు ప్రకృతి వేసే శిక్షకు గురికాక తప్పదని, చేసిన పాపం ఊరికే పోదని తెలిపారు.
రూ.2,800 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
బ్రహ్మోస్ మిసైల్స్ ఉత్పత్తి పరిశ్రమను ఇక్కడకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలి పారు. ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)కు స్థలాలను చూపించాలన్నారు. గతంలో పేదరికాన్ని చూపేందుకు అప్పటి పాలకులు టోనీ బ్లెయిర్ను తీసుకువచ్చారని, ఇపుడు మన అభివృద్ధి, ప్రాజెక్టులను, విద్యా సంస్థలను చూపించేందుకు వివిధ దేశాల నాయకులను పిలవాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఉపాధి రంగాలకు ప్రాముఖ్యత ఇస్తానని అన్నారు. రెండో ట్రిపుల్ఐటీని ఇక్కడ కేటాయించామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలకు రూ. 2,800 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేశామని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. ఎస్జీడీ రెండో యూనిట్ మొదలుపెట్టడానికి ముందే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న అగ్రిమెంట్తోనే కంపెనీ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
మొదటి ముద్ద పాలమూరుకే..
పాలమూరు జిల్లా నుంచి సీఎంగా తనకు అవకాశం వచ్చిందని, రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు వచ్చినా అందులో మొదటి ప్రాధాన్యం జిల్లాకే ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే అని తెలిపారు. ఎక్కడ తట్ట పని ఉన్నా పాలమూరు జిల్లావాసు లు వెళ్లేవారని, వలసల జిల్లాగా మారడం వల్ల చదువులో వెనకబడిపోయామని చెప్పారు. పాలమూరును పదేండ్లలో గత బీఆర్ఎస్ సర్కా రు పట్టించుకో లేదని విమర్శించారు. పాలమూ రు యూనివర్సిటీ కేవలం ఓ పీజీ కాలేజీలాగా ఉండేదని, ఇప్పుడు జిల్లాలో విద్య, ఉపాధి అవ కాశాలను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. గ్రీన్ చానల్ ద్వారా జిల్లా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.‘‘కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం తెస్తే కొం దరు ఎన్జీటీలో ఫిర్యాదు చేస్తున్నారు.
భూసేక రణ అడ్డుకొని కొడంగల్లో ఇచ్చినట్లు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితి వేరు, అక్కడ కోస్గి పట్టణంలో భూసేకర ణ చేయడంవల్ల రేటు ఎక్కువ ఇస్తున్నాం. కావాలంటే నారాయణపేట నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం. భూసేకరణ కోసం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.