
- రాష్ట్ర ప్రజలు ఆయనను పక్కన పెట్టేశారు
- ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తామంటే ఎంతోకాలం నడ్వదు
- పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి
- 9 వర్టికల్ రంగాల్లో అవసరాలకు తగ్గట్లుగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’
- రాష్ట్రాభివృద్ధికి ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్
- పీఏఎఫ్ఐ సదస్సులో సీఎం రేవంత్ ప్రసంగం
- న్యూజెర్సీ గవర్నర్ సహా పలువురు ప్రముఖులతో వరుస భేటీలు
- రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
- రాష్ట్ర ప్రజలు ఆయనను పక్కనపెట్టేశారు: సీఎం రేవంత్
న్యూఢిల్లీ, వెలుగు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణలోనూ ఒక ట్రంప్ (కేసీఆర్) ఉండేవారు.. తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్ను పక్కన పడేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన నడిపించే వారెవరైనా ట్రంప్ అవుతారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే.. మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం ఎంతోకాలం నడ్వదు. ట్రంప్ ఒకరోజు మోదీ నా ఫ్రెండ్ అని అంటాడు.. మరోరోజు ఇండియాపైనే అడ్డగోలుగా సుంకాలు వేస్తాడు” అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్లో ‘పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా’ (పీఏఎఫ్ఐ) 12వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ‘విజన్ తెలంగాణ రైజింగ్ 2047’ అనే అంశంపై ప్రసంగించారు. పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ అవసరమన్నారు.
రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. నాలెడ్జ్ హబ్పై ఫోకస్ పెట్టాలని, ఎవరు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినా వాళ్లకు పూర్తిగా తమ మద్దతు, భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. 9 వర్టికల్ రంగాల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలోపెట్టుకుని కొత్తగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే తరాలకు అవకాశాలను క్రియేట్ చేయాలని తమ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నదని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. హైదరాబాద్కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్-–2047’ రూపొందించామని వివరించారు. నాలెడ్జితోపాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. తెలంగాణలో సేంద్రియ పంటలు పండుతున్నాయని, పెట్టుబడిదారులకు తాము మద్దతుగా నిలుస్తామన్నారు.
డిసెంబర్ 9న ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్’ రిలీజ్
ఈ ఏడాది డిసెంబర్ 9న ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజించాం. కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను తయారీ రంగం జోన్ (మాన్యుఫాక్చర్)గా నిర్ణయించాం. రాష్ట్ర అభివృద్ధికి తగ్గట్లుగా 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లు పొడిగించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దానిని 15 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సబర్మతీ తీరంలా మూసీని మారుస్తాం. అందుకు మూసీ పునరుజ్జీవంపై దృష్టి సారించాం. 2027 నాటికి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉండనున్నాయి’’ అని వివరించారు.
ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం
భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. 30వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ నగరంలో తొలి దశలో ఏఐ సిటీ, ఎడ్యుకేషన్, హెల్త్లాంటి 9 జోన్లు ఉంటాయన్నారు. ‘‘ఎయిర్ పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి అనుసంధానత కల్పిస్తాం. తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ లాక్డ్) కావడంతో ఓడ రేవు లేదు. మచిలీపట్నం ఓడ రేవు అనుసంధానానికి ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే.. దానికి సమాంతరంగా రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా స్ఫూర్తిని అనుసరిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. స్పోర్ట్స్లో దక్షిణ కొరియాలాంటి చిన్న దేశాలకు వచ్చే మెడల్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం” అని వివరించారు.
న్యూజెర్సీ గవర్నర్తో భేటీ...
ఢిల్లీ పర్యటనలో భాగంగా న్యూజెర్సీ గవర్నర్ పిలిప్ డి.మర్ఫీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎడ్యుకేషన్, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో, పట్టణ రవాణా), మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై ఆయనతో చర్చిం చారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ విజన్ 2047’ సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం రేవంత్రెడ్డి వివరించారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గే బ్రెండేతోనూ సీఎం రేవంత్ సమావేశమయ్యారు. అలాగే అమెజాన్ ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ చేతన్ కృష్ణస్వామితోనూ సీఎం భేటీ అయ్యారు. తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రోత్సహిస్తామని చేతన్ హామీ ఇచ్చారు. గోద్రెజ్ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం సమావేశమయ్యారు.