హైదరాబాద్, వెలుగు: చీఫ్ మినిస్టర్స్ కప్ (సీఎం కప్) రెండో ఎడిషన్ ఈ నెల 17 నుంచి జరగనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) నిర్వహించే ఈ క్రీడాపోటీలకు సంబంధించి అవగాహన కల్పించడానికి గురువారం నుంచి పది రోజుల పాటు టార్చ్ ర్యాలీ కొనసాగనుంది.
అనంతరం ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో తొలి విడత పోటీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మండల (28–30), నియోజకవర్గ (ఫిబ్రవరి 3–7), జిల్లా స్థాయి (ఫిబ్రవరి10–14) పోటీలు ఉంటాయి. ఫిబ్రవరి 19 నుంచి 26 వ తేదీ వరకు స్టేట్ లెవల్ పోటీలు జరగనున్నాయి. మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహిస్తామని శాట్జ్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్జ్ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, శాట్జ్ ఎండీ సోనీబాల దేవి పాల్గొన్నారు.
