
- గోదావరి, కృష్ణా జలాల్లో రాజీపడేది లేదు: సీఎం రేవంత్
- వాటా సాధించే వరకు ఎవరి బెదిరింపులకూ లొంగేది లేదు
- మన అవసరాలు తీరాకే వేరేవాళ్లకు నీళ్ల గురించి ఆలోచన
- శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరామ్సాగర్, కోయిల్సాగర్తోనే వరి దిగుబడులు
- రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సెంటిమెంట్లు రెచ్చగొడుతున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఎవరెన్ని కుట్రలు చేసినా.. వాటిని ఛేదించుకొని, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రావాల్సిన వాటాను సాధించి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన వాటాల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని తేల్చి చెప్పారు. శుక్రవారం గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు.
‘‘ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగు, తాగునీటి కోసం. తెలంగాణ ప్రజల భావోద్వేగం, పేగు బంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి చుక్కనూ సాధించి తీరుతం. ఈ క్రమంలో ఎవరి ఒత్తిళ్లకూ లొంగేది లేదు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటం. మన ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాకే మిగతా ఎవరికైనా నీళ్లు. తెలంగాణ ప్రజల హక్కులను సాధిం చడంలో వెనుదిరిగి చూసేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది” అని వ్యాఖ్యానించారు.
గత పాలకులు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టు కట్టడం, కూలడం, ఆ లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ల ముందే జరిగిపోయాయని ఎద్దేవా చేశా రు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్లు రెచ్చగొడుతున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని అన్నారు.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ
కృష్ణా నదీ జలాల్లో ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి లాంటి పథకాలను పూర్తి చేసి.. దేశానికే ఆదర్శంగా నిలబడేలా రాష్ట్రంలో పరిపాలనను అందిస్తామని చెప్పారు. నెహ్రూ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ లాంటి ప్రాజెక్టులు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
ఈ ప్రాజెక్టులను నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి అవగాహన, ప్రణాళికలు, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించామని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నీటితోనే వరి పండిస్తున్నట్లు తెలిపారు.