- 2 లక్షలకుపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా
జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గుట్టపై స్వయంభుగా వెలిసిన గట్టు మల్లన్నస్వామి, మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు సిద్ధమయింది. నేడు, రేపు శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈసారి జాతరకు సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకట స్వామి చొరవతో జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రాకపోకలకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేశారు. రవాణాతోపాటు తాగునీరు, గోదావరి నదివద్ద స్నానాలు, శానిటేషన్ నిర్వహణ కోసం డీఈ విద్యాసాగర్, ఎంపీఓ శ్రీపతి బాపురావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
జాతరకు 400 మందితో పోలీసు బందోబస్తు
జాతరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో 400 వందల పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేలా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించామని, ఆలయ పరిసరాల్లో కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు.
