- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటం పిల్లలను రెచ్చగొట్టొద్దు..
- యువత సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం
- పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి
- ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి
- ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశంలో మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఘోర పాపమని, ఇలాంటివి మళ్లీ జరగకూడదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని, ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అసలు సూత్రధారులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూసేందుకు దేశంలోని దిగ్గజ న్యాయవాదుల సేవలను వినియోగించుకుంటున్నట్టు వెల్లడించారు.
నీట్లాంటి పోటీ పరీక్షల్లో అక్రమాలు జరగకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక బలమైన, పకడ్బందీ పరీక్షా విధానాన్ని రూపొందించడం జాతీయ బాధ్యత అని తెలిపారు. మంగళవారం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశంలో నీట్పేపర్ లీక్పై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ‘‘నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, దోషులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలన్నారు” అని పేర్కొన్నారు.
- యువత సంక్షేమం కోసం పనిచేయాలి: మోదీ
‘‘దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉంది. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలి ’’ అని ప్రధాని మోదీ సూచించారు. పిల్లలను రెచ్చగొట్టొద్దని, తప్పుడు మార్గంలోకి వెళ్లడం సులభం.. కానీ తిరిగి సరైన మార్గంలోకి రావడం చాలా కష్టమని, వారు సరైన మార్గంలో వెళ్లేలా చూసుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీక్ ఆరోపణలు రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, దర్యాప్తును సీబీఐకి అప్పగించిందని వెల్లడించారు. ఇప్పటివరకు 13 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్టు తెలిపారు. ‘‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షల ప్రక్రియలో భాగమైన ఒక కెమిస్ట్రీ లెక్చరరే ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారిగా సీబీఐ గుర్తించి అదుపులోకి తీసుకుంది.
విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా చూసేందుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రీ-ఎగ్జామ్ నిర్వహించాం” అని ఆయన పేర్కొన్నారు. పేపర్ లీకేజీలలాంటి ఘటనలను శాశ్వతంగా అరికట్టడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసికట్టుగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు.
రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం
భారత్- అమెరికా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్టీఏ) నిరసిస్తూ పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద ‘కిసాన్ మహాపంచాయత్’ నిర్వహించేందుకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ వారికి హామీ ఇచ్చారు. వివిధ దేశాలతో కుదుర్చుకునే ఎలాంటి వాణిజ్య ఒప్పందాల్లోనైనా రైతుల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. విదేశీ ఒప్పందాల వల్ల దేశీయ రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని, దేశ శ్రేయస్సుతోపాటు రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత కీలకమని ప్రధాని మోదీ వెల్లడించారు.
