
తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తానని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మంత్రుల శాఖలపై క్లారిటీ ఇచ్చారు.
సీఎం దగ్గర హోం శాఖ, మున్సిపల్, విద్య, క్రీడలు సహా 11 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల నుంచే కొత్త మంత్రులకు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాత మంత్రుల శాఖల మార్పు లేనట్లేనని తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన వెంటనే పోర్ట్ ఫోలియోలు అలాట్ చేయనున్నట్లు తెలిపారు.
మంత్రి వర్గ విస్తరణ, కొత్త శాఖల కేటాయింపు లో భాగంగా సీఎం ఢిల్లీకి వెళ్లారన్న ఊహాగానాలను కొట్టిపడేశారు. తాను ఢిల్లీకి వచ్చింది కర్ణాటక, తెలంగాణ లో కులగణన సక్సెస్ అయిన విషయాన్ని పంచుకోవడానికేని చెప్పారు సీఎం రేవంత్.
తెలంగాణలో ఇటీవలే మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. కొత్తగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి లకు మంత్రి పదవులు కేటాయించగా... వారికి ఏ శాఖ ఇస్తారనే ఊహాగానాలు పెరిగిన వేళ సీఎం క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణకు ప్రధాన అడ్డంకి కిషన్ రెడ్డి.. ప్రధాన శత్రువు కేసీఆర్ కుటుంబం:
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే అని అన్నారు. అదే విధంగా తెలంగాణకు కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువని విమర్శించారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ ఒక్కటేనని ఈ సందర్భంగా అన్నారు.
నేను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఉండదు:
కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పిన కవిత మళ్లీ ఆ గ్రూప్ తో ఎలా కలిసిందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. దెయ్యాలున్నాయని చెప్పి ఆ గ్రూప్ తోనే కమిషన్ విచారణకు పోయిందని విమర్శించారు. దెయ్యాల్లో ఆమెకూడా భాగం అయిందా? అని ప్రశ్నించారు. వాళ్లందరూ ఒక్కటేనని, వాళ్లను ఎవరూ పట్టించుకుంటలేరనే అందరు కలిసి కొత్త చర్చకు తెర లేపారని అన్నారు.
కవిత కాంగ్రెస్ లో చేరుతుందనే ఊహాగానాలను కొట్టిపారేశారు సీఎం రేవంత్. కవిత కొత్త పార్టీ పెట్టుకుంటుందేమో.. కాంగ్రెస్లో ఎందుకు చేరుతదని ప్రశ్నించారు. తాను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కంగ్రెస్ లోకి ఎంట్రీ లేదని ఈ సందర్భంగా అన్నారు సీఎం.