స్మిత సభర్వాల్ పై సీఎం చర్యలు తీసుకోవాలి: బాలలత

స్మిత సభర్వాల్ పై సీఎం చర్యలు తీసుకోవాలి: బాలలత

    దివ్యాంగులను తీవ్రంగా అవమానించారు
    సీఎస్​బీ ఐఏఎస్ అకాడమీ చైర్​పర్సన్ బాలలత

హైదరాబాద్, వెలుగు: సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగుల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్​పై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని సీఎస్​బీ ఐఏఎస్ అకాడమీ చైర్​పర్సన్ బాలలత డిమాండ్ చేశారు. సివిల్స్ పోస్టులకు దివ్యాంగులు అనర్హులని ఆమె ఎలా చెప్తారని మండిపడ్డారు. స్మితా సబర్వాల్ కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సివిల్స్​లో దివ్యాంగుల కోటా గురించి మాట్లాడటానికి ఆమె ఎవరు? ఎంతో మంది దివ్యాంగులు సివిల్స్​కు ఎంపికై సమాజానికి సేవలందిస్తున్నారు. స్మితా సబర్వాల్ కంటే ఎక్కువ కష్టపడ్తున్నరు. 

అన్ని రంగాల్లో దివ్యాంగులు ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రపంచంలోని గొప్ప సైంటిస్టుల్లో ఒకరు స్టీఫెన్ హాకింగ్ దివ్యాంగుడే.. ఇరా సింఘాల్ అనే దివ్యాంగురాలు సివిల్స్​లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఐఏఎస్ ఆఫీసర్​గా 24 ఏండ్ల అనుభవం ఉన్న సీనియర్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇలాంటి కామెంట్లు చేయొచ్చా?’’అని బాలలత ప్రశ్నించారు. ఇలాంటి కామెంట్లు చేస్తే.. దివ్యాంగుల కమ్యూనిటీ ఎంత బాధపడుతుందో ఆలోచనా రాదా? అని మండిపడ్డారు. తప్పుడు కామెంట్లు చేసి.. సమర్థించుకోవడం దారుణమని ఫైర్ అయ్యారు. తానే ఎంతో అనుభవం ఉన్న ఆఫీసర్ అని.. తనకే అన్నీ తెలుసని స్మితా సబర్వాల్ అనుకుంటున్నారని విమర్శించారు. జ్యుడీషియరీ, ప్రభుత్వం కంటే అనుభవం ఉందా? అని బాలలత నిలదీశారు.