హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎంను ప్రతివాదిగా చేయలేదంటూ ప్రభుత్వం వాదించడాన్ని నిందితుల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్డీ సంజయ్ ఖండించారు. తుషార్ వెల్లపల్లి దాఖలు చేసిన రిట్ పిటిషన్లో ఏడో ప్రతివాదిగా సీఎం ఉన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటు చేసే సిట్కు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ రాష్ట్ర సర్కార్, సిట్, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వేర్వేరుగా వేసిన అప్పీల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ కొనసాగించింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట లాయర్ సంజయ్ వాదనలు వినిపించారు. సీఎంను ప్రతివాదిగా చేయలేదని ప్రభుత్వం వాదించడాన్ని తప్పుపట్టారు. అన్నీ సీఎం కనుసన్నల్లోనే జరిగాయని, సీఎం మీడియాకు వీడియోలను విడుదల చేయడం సిట్ దర్యాప్తును ప్రభావితం చేయడమేనని చెప్పారు. కేసును సీబీఐకి ఇస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం అవసరం లేదని విన్నవించారు.
నిందితులపై కక్ష సాధింపు చర్యలు
అక్టోబర్ 26న ఫామ్ హౌస్లో ఘటన జరిగితే ఆ తర్వాత రోజు తేదీతో పంచనామా రిపోర్టు ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని డివిజన్ బెంచ్ని మరో సీనియర్ న్యాయవాది ఉదయ్ హోల్లా కోరారు. సిట్ టీంలోని ఏడుగురిలో ముగ్గురు ఐపీఎస్లు, నలుగురు రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్కు చెందిన వారని, వీళ్లలో ఎవరికైనా ప్రమోషన్స్ ఇవ్వాలన్నా, బదిలీ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సిట్ కేసు దర్యాప్తు చేయడానికి వీల్లేదన్నారు. సీబీఐ దర్యాప్తునకు వీలుగా వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకునే ఆస్కారం లేదన్నారు.
ఎఫ్ఐఆర్లో కరీంనగర్ న్యాయవాది బి.శ్రీనివాస్ పేరు కూడా లేదని, సాక్షిగా హాజరుకావాలని సిట్ నోటీసు ఇవ్వడానికి 30 మంది పోలీసులు వచ్చి భయబ్రాంతులకు గురిచేశారని చెప్పారు. శ్రీనివాస్ ఏమీ దావూద్ ఇబ్రహీం కాదన్నారు. నోటీసు ఇంటి గోడపై అతికించి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచారం చేయించారని తప్పుపట్టారు. సిట్ ఎదుట శ్రీనివాస్ హాజరైతే, ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఇతర అగ్రనేతల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. నిందితులకు బెయిల్ వచ్చాక ఇతర కేసుల్లో అరెస్టు చేసి కక్షపాధింపునకు పాల్పడ్డారని చెప్పారు.
సీబీఐకి అవసరం లేదు: రాష్ట్ర సర్కారు
ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు లోతుగా జరుగుతున్నందున కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మొయినాబాద్ ఫామ్హౌస్ ఘటన అక్టోబర్ 26న జరిగితే.. నవంబర్ 3న సీఎం మీడియా సమావేశం నిర్వహించారని, ఈ మధ్యకాలంలోనే హైకోర్టులో రిట్ కూడా దాఖలైందని చెప్పారు. సమాచారం అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సీఎం ద్వారానే ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యిందని భావించడం చెల్లుబాటు కాదన్నారు. అక్టోబర్ 26న ఘటన జరిగితే, 27, 29 తేదీల్లో సీడీలను మేజిస్ట్రేట్ కోర్టు, నవంబర్ 3న ఉదయం 11 గంటలకు హైకోర్టుకు ఇచ్చారన్నారు. ఆ తర్వాతే సీఎం మీడియా సమావేశం నిర్వహించారని చెప్పారు. ఆన్లైన్లో జరిగిన వాదనలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.