దసరా నుంచి వైజాగ్ నుంచే ఏపీ పాలన

దసరా నుంచి వైజాగ్ నుంచే ఏపీ పాలన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యకలాపాలను విశాఖ కేంద్రంగా నిర్వహించేందుకు సిఎం జగన్ రెడీ అయ్యారు. దసరా నాటి నుంచి విశాఖలోనే సిఎంఓ కార్యక్రమాలు నిర్వహిస్తుందని మంత్రి వర్గ సహచరులకు సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన వ్యవహారాలను విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించాలని సిఎం జగన్ నిర్ణయించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విశాఖపట్నం రాజధాని తరలింపు వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో దసరా నాటికి పూర్తి చేయాలని  సీఎం జగన్ భావిస్తున్నారు. క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఏడాది దసరా పండుగ విశాఖపట్నంలో జరుపుకుంటామని  సీఎం వ్యాఖ్యానించారు. 

ALSO READ : పార్టీ సభ్యత్వం తీసుకుంటే.. రూ. 300లకు 2వందల గజాల భూమి..

ఆంధ్రప్రదేశ్‌ రాజాధాని వికేంద్రీకరణ విషయంలో 2019 డిసెంబర్‌ నుంచి వివాదం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో పాటు కోర్టు వివాదాలు తలెత్తాయి.  సీఎం జగన్ విశాఖలో బస చేయడానికి అనువుగా రిషికొండలో నిర్మాణాలను కూడా పూర్తి కావొస్తున్నాయి. రాజధాని తరలింపు విషయంలో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్లనివ్వకుండా చేశామని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలన ఎక్కడి నుంచైనా చేపట్టే అవకాశాలు ఉండటంతో దసరా పండుగ నాటి నుంచి విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

పరిపాలన రాజధానిగా విశాఖపట్నంలో పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఈ విషయంలో ముందడుగు పడొచ్చు. హైకోర్టు, సుప్రీం కోర్టులో ఉన్న పిటిషన్ల వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. డిసెంబర్‌లో కేసుల విచారణ వాయిదా పడటంతో ప్రస్తుతానికి సిఎం జగన్ కార్యాలయం మాత్రమే విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది.

కొన్ని కార్యాలయాలను విశాఖకు  తలించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆ కమిటీ సూచనల మేరకు కార్యాలయాలను తరలిస్తామని మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కార్యాలయాల తరలింపుపై ఇప్పటికే న్యాయస్థానాలు స్టే ఇచ్చాయి. అయితే కార్యాలయాలను కూడా తరలిస్తామని సీఎం జగన్ మంత్రులకు చెప్పడం ఆసక్తికరంగా మారింది.